Educational gift from June 1st
- జూన్ 1 నుంచి విద్యాకానుక
- 36 లక్షల మంది విద్యార్థులకు విద్యాకిట్
- ఫిబ్రవరిలో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన
- జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
- మెనూలో మార్పులకు అదనంగా 344 కోట్ల ఖర్చు
- విద్యా సంస్కరణలకు నాలుగు అడుగులు వేశాం
- అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చలో సీఎం జగన్
జగనన్న విద్యాకానుక’ పేరుతో జూన్ 1నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.1,350 విలువైన విద్యాకిట్ ఇచ్చే కొత్త పథకాన్ని అమలులోకి తెస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో అమ్మఒడి పథకంపై మంగళవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వచ్చే విద్యాసంవత్సరంలో 36.10లక్షల మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, టెక్ట్స్బుక్స్, నోట్బుక్స్తో పాటు మూడుజతల యూనిఫాంలు, బూట్లు, రెండు జతల సాక్స్తో కలిపి విద్యాకిట్ అందిస్తాం. ఫిబ్రవరిలో జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులు ఉన్నతవిద్య ఎక్కడ చదువుతున్నా హాస్టల్ మెస్ బిల్లుకు రెండు విడతలుగా రూ.20వేలు ఇస్తాం.* *విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించి ఉన్నత చదువులకు వెళ్లలేని 77శాతం మందికి విద్యావకాశాలు కల్పిస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమల్లోకి తెచ్చి విద్యావకాశాలపై నాలుగడుగులు వేశామని చెప్పారు. ‘‘మొదటి అడుగుగా 82లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి అమలు చేయాలని నిర్ణయించాం. ఈనెల 9న 40.19లక్షల మంది తల్లుల ఖాతాలకు రూ.6,028కోట్లు ఒకేసారి జమచేశాం. మధ్యాహ్న భోజన పథకం అమల్లో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు రెండో అడుగు వేశాం*
భోజనం తయారుచేస్తున్న ఆయాలకు ఇప్పటి వరకూ నెలకు రూ.1,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. దాన్ని రూ.3వేలకు పెంచాం.’’ అని జగన్ ప్రకటించారు. మార్పులతో చేపడుతున్న ఈ పథకానికి ఆయన ‘గోరుముద్ద’గా నామకరణం చేశారు. అయితే సభలో అందరూ జగనన్న గోరుముద్దగా పిలవాలని సూచించడంతో సీఎం కూడా అదే పేరును ప్రకటించారు. దీనికోసం రూ.344కోట్లు అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వం సంతోషంగా అమలు చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై పరిశీలన కోసం నాలుగు స్థాయుల్లో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలుకు సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గుడ్లకు కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఇక మూడో అడుగు ఇంగ్లీషు మీడియం వైపు వేశాం. రైట్ టు ఎడ్యుకేషన్ కాకుండా రైట్ టు ఇంగ్లీషు మీడియం అమల్లోకి తీసుకొస్తున్నాం. ఇంగ్లీషు మీడియం పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి వెట్రిసెల్విని నియమించాం. నాలుగో అడుగులో రాష్ట్ర వ్యాప్తంగా 45వేల స్కూళ్లకు గాను 15,715 బడుల్లో పనులు చేపట్టేందుకు నిర్ణయించాం. ఈనెల 18నాటికి 12,368 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి’’ అని సీఎం వివరించారు.
0 Response to "Educational gift from June 1st"
Post a Comment