Inspiration
- ఈ గురువు.. సెలవు పెట్టరు
- నాలుగేళ్లుగా ఒక్కరోజూ డుమ్మా కొట్టలేదు
- ఆదర్శంగా శ్రీరాంనగర్ పాఠశాల ఉపాధ్యాయుడు
ప్రధానాంశాలు
ఈ గురువు.. సెలవు పెట్టరు
నాలుగేళ్లుగా ఒక్కరోజూ డుమ్మా కొట్టలేదు
ఆదర్శంగా శ్రీరాంనగర్ పాఠశాల ఉపాధ్యాయుడు.
ఇంజినీర్ బాగా పనిచేస్తే చక్కటి నిర్మాణం రూపుదిద్దుకుంటుంది..
వైద్యుడు మెరుగైన చికిత్స అందిస్తే ఒకరి ఆరోగ్యం బాగుపడుతుంది..
అదే ఉపాధ్యాయుడు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే.. రేపటి తరమే స్ఫూర్తి పొందుతుంది..
గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి..ఇలా గురుతర బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ.. గత నాలుగేళ్లలో ఒక్క సెలవైనా పెట్టకుండా విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు బోరబండ శ్రీరాంనగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గౌరీశంకర్.
హైదరాబాద్:
1998 డీఎస్సీ ద్వారా కేవీఎస్ గౌరీశంకర్ ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. స్కూల్ అసిస్టెంట్(ఫిజిక్స్)గా పదోన్నతి పొంది.. ఖైరతాబాద్ మండలంలోని శ్రీరామ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అంతకుముందు యూసుఫ్గూడ, ఎన్బీటీనగర్, బోరబండ పాఠశాలల్లో పనిచేశారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఎక్కువగా సెలవులు ఉంటాయి. దీనికితోడు కొందరు ఉపాధ్యాయులు చీటికిమాటికి సెలవులు పెడుతూ తరగతులను గైర్హాజరు అవుతుంటారు. తల్లిదండ్రుల్లో.. పిల్లల్లో అటువంటి వారిపై చులకన భావం ఏర్పడుతుంది. దీనిని పొగొట్టాలన్న ఉద్దేశంతో గౌరీశంకర్ ఆరేళ్ల కిందట సెలవులు పెట్టకుండా పాఠశాలకు రావాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఏడాదిపాటు పాటించినా.. మరుసటి ఏడాది ఒక్కరోజు సెలవు పెట్టాల్సి వచ్చింది. అనంతరం 2016 నుంచి 2019లో ఒక్క రోజూ సెలవు పెట్టకుండా విధులకు హాజరయ్యారు.
హాజరు ఎంతో కీలకం..
విద్యార్థులు రాణించాలంటే పాఠశాలకు రావడం కీలకం. రెండేళ్ల కిందట విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఏడాదిలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా తనలా నిత్యం పాఠశాలకు వస్తే బహుమతి ఇస్తానని గౌరీశంకర్ ప్రకటించారు. దీన్ని అందిపుచ్చుకుని గత, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థినులు ధనలక్ష్మి, వనజ ఒక్క సెలవు కూడా తీసుకోకుండా బడికి వచ్చారు. కొన్నిసార్లు నలతగా ఉన్నప్పటికీ గౌరీశంకర్ క్రమంతప్పకుండా హాజరయ్యేవారు.
ఇతర కార్యక్రమాల్లోనూ..
గౌరీశంకర్ ఎస్ఈఆర్టీలో రాష్ట్ర రీసోర్స్ పర్సన్గా ఉన్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ను వృద్ధి చేయడంపై పనిచేస్తున్నారు. మన టీవీలో స్టేట్ రిసోర్స్ బృందంలో, పాఠ్యపుస్తకాల తప్పుల సవరణ బృందంలోను పనిచేశారు. రామంతాపూర్లోని సైట్లో రిసోర్స్ పర్సన్గాను సేవలందించారు.
నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్నా: గౌరీశంకర్
ఫలితాల పరంగా చూసుకుంటే ఉపాధ్యాయులందరికీ వందశాతం ఉత్తీర్ణత ఉంటోంది. వారితోపాటు నాకూ ఉంటోంది. అందుకే ప్రత్యేక గుర్తింపు కోసం వందశాతం హాజరు ఉండేలా కృషి చేశాను. దీనివల్ల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపవచ్చని నా అభిప్రాయం. పిల్లలను నిత్యం పాఠశాలకు రమ్మని చెప్పడమే కాదు.. మనమూ పాటిస్తే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
0 Response to "Inspiration"
Post a Comment