Online teaching should be in the mother tongue
ఆన్లైన్ బోధన మాతృభాషలో సాగాలి.
కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉచితంగా ఇవ్వాలి
వెబినార్లో విద్యావేత్తల అభిప్రాయం
కొవిడ్ నేపథ్యంలో పిల్లలను ఆన్లైన్ విద్యవైపు మరల్చడానికి వారిలో ప్రేరణ నింపడమే ముఖ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషలో బోధన దీనికి బాగా ఉపకరిస్తుందని వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలను బెదిరించడం, కొట్టడం ద్వారా ఆన్లైన్ విద్య సాధ్యపడదని, వారి మనసును తెలుసుకోవాలని సూచించారు. చిన్నారులు ఆన్లైన్ తరగతుల్లో ఉన్నంతసేపు వారిపై పర్యవేక్షణ అవసరమన్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆన్లైన్ విద్యాబోధనలో సమస్యలపై తానా సహకారంతో కిన్నెర స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వెబినార్లో విద్యావేత్తలు డాక్టర్ మూల్పూరి వెంకటరావు, డాక్టర్ సీతారామారావు, పాల్గొనగా రవిరాంప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వక్తలు మాట్లాడుతూ ‘విద్యార్థులకు ఆన్లైన్లో చదువు చెప్పడం సవాలే. ఈ విధానంతో కుటుంబం, పాఠశాల రెండూ ఒకటిగా మారాయి. దీనిపై తల్లిదండ్రులకు యాజమాన్యాలు స్పష్టతనివ్వాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడానికి తల్లిదండ్రులకు ఇది మహత్తర అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు.పేద విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు కంప్యూటర్, సెల్ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా ఇవ్వాలని వారు సూచించారు. ‘విద్యారంగానికి వేలకోట్లు కేటాయించే ప్రభుత్వాలకు ఇది పెద్ద సమస్య కాదు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావాలి. కొవిడ్ మహమ్మారి తగ్గిన తర్వాత కూడా ఆన్లైన్ విద్య కొనసాగే అవకాశం ఉంది. గ్రామాల్లోని పిల్లలకు మంచి విద్య అందేందుకు ఇదో అవకాశం. సబ్జెక్టుకే పరిమితం కాకుండా సృజనాత్మక అంశాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది’ అని పేర్కొన్నారు.‘ఈ విధానంలో బోధనకు ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు బోధించడానికి గతంలో కంటే మరింత పరిశ్రమ అవసరం. చెప్పిన అంశం పిల్లలకు ఎంతవరకు అర్థమైందో గుర్తించగలగాలి. బోధించిన అంశాన్ని రికార్డింగ్ రూపంలో పిల్లలకు అందుబాటులో ఉంచాలి’ అని సూచించారు
0 Response to "Online teaching should be in the mother tongue"
Post a Comment