Vaccine for those crore people in the early stages ..!
తొలిదశలో ఆ కోటి మందికి వ్యాక్సిన్..!
వివరాలు సేకరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భారత్లో కరోనా పోరులో ముందువరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకే ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, 92శాతం ప్రభుత్వ ఆసుపత్రులు, 55శాతం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఇప్పటికే సమాచారం సేకరించింది. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే తొలిదశలో భాగంగా దాదాపు కోటి మంది ఆరోగ్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్ అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్ మధ్యంతర ఫలితాలను వెల్లడిస్తుండడం, అమెరికా, బ్రిటన్ దేశాల్లో మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోనూ ప్రయోగదశల్లో ఉన్న వ్యాక్సిన్లు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. దీంతో భారత్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై గత కొన్నిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. వీటిలో భాగంగా, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలనుంచి ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని కోరింది. ముఖ్యంగా, తొలిదశలో వైద్యులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా వర్కర్లు మొదలైన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 92శాతం ప్రభుత్వ ఆసుపత్రులు, 55శాతం ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది సమాచారాన్ని సేకరించారు. వచ్చే వారంలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి వ్యాక్సిన్ ఏ విధంగా అందించాలనే వ్యూహంపై పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తాజాగా ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
0 Response to "Vaccine for those crore people in the early stages ..!"
Post a Comment