Prices rose for the second time in 15 days
15 రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగిన ధరలు
దిల్లీ: వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ రాయితీ గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డిసెంబరు 2వ తేదీన ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచిన చమురు సంస్థలు.. మంగళవారం మరో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వినియోగదారులకు రాయితీగా అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 644గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 694కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఆ మేరకు గ్యాస్ ధర మోత మోగనుంది. ఇక 5 కేజీల సిలిండర్పై రూ.18.. 19 కేజీల సిలిండర్పై రూ.36.50 పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.
గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్పై రాయితీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. వినియోగదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరలకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.
0 Response to "Prices rose for the second time in 15 days"
Post a Comment