Teacher's letter cultivation ..!
ఉపాధ్యాయుని అక్షర సేద్యం..!
సున్నా నుంచి 107కు చేరిన విద్యార్థుల సంఖ్య
మాచర్ల గ్రామీణ, న్యూస్టుడే సర్కారీ బడులను ఉపాధ్యాయులు ఏం పట్టించుకుంటారు.. అనే వారంతా అబ్బురపడేలా చేశాడు ఆ మాస్టారు.. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువంటే బడికి వచ్చామా.. వెళ్లామా.. అని ఆలోచించ లేదాయన. ఏదో చేయాలనే తపనే ఆయన్ను ముందుకు నడిపించింది. మాచర్ల పట్టణంలోనే సోమిరెడ్డి బజారు చివర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల చుట్టూ గతంలో పిచ్చిమొక్కలే కనిపించేవి. ఉన్న ముగ్గురు చిన్నారులు సైతం బడి మానుకొని మరో పాఠశాలలో చేరారు. విద్యార్థుల సంఖ్య జీరోకు చేరింది. రేపో మాపో పాఠశాలను ఎత్తేస్తారనే పరిస్థితి. అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా 2017 ఆగస్టు 9 బాధ్యతలు చేపట్టిన బూసాని శివకోటేశ్వరరావు మాస్టారు అక్కడ అక్షర సేద్యం చేపట్టారు. ముక్కుమూసుకొని వెళ్లే పాఠశాల ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చారు. పిల్లలు లేక మూతవేత దిశగా ఉన్న చోట ప్రస్తుతం 107 మంది చేరేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పి నమ్మకం కలిగించారు. ఆయన విధి నిర్వహణలో చూపిన అంకితభావం పలువురికి ఆదర్శంగా నిలిచింది. శివకోటేశ్వరరావు మాస్టారి కృషిని అధికారులు సైతం గుర్తించడంతో ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని’గా పురస్కారం అందుకున్నారు. ఆయన బోధనతో పాటు విద్యార్థులకు యోగా.. ఆటపాటలు.. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంచేలా పలు అంశాలు నేర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో యూట్యూబ్.. ఆన్లైన్ ద్వారా పిల్లలకు పాఠాలు బోధించారు. పాఠశాలకు పూర్వవైభవం తేవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సమయంలో సాంకేతికత సద్వినియోగం
ఒక ఉపాధ్యాయునిగా ఆయా ప్రాంతాల్లో గృహాలకు వెళ్లి పిల్లల బాధ్యత నాదంటూ తల్లిదండ్రులకు నమ్మకం కలిగించా. చదువుతో పాటు ఆటలు.. పాటల్లో విద్యార్థులు ముందంజలో ఉండేలా తర్ఫీదు నిచ్ఛా కరోనా లాక్డౌన్ సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ‘ప్రభుత్వ బడి.. అమ్మఒడి’ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు, పాఠాలు బోధిస్తుంటే వారిలో మరింత ఆసక్తి పెరిగింది. విద్యార్థులు 107కు పెరగడంతో మరో ఉపాధ్యాయ పోస్టు మంజూరయ్యే అవకాశముంది.
- బూసాని శివకోటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, మాచర్ల
0 Response to "Teacher's letter cultivation ..!"
Post a Comment