All employees must participate in the election
ఉద్యోగులంతా ఎన్నికల్లో పాల్గొనాల్సిందే
సుప్రీంకోర్టు ఆదేశమిది: సీఎస్
సంఘాల నేతలతో అత్యవసర భేటీ
షెడ్యూల్ వాయిదా కుదరదు
ఉద్యోగులకు తేల్చిచెప్పిన దాస్
అమరావతి, విజయవాడ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మేరకు నిర్వహించాల్సిందేనని.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయితే తప్ప.. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా చెబుతుండడంతో సీఎస్ మంగళవారం వారితో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు కేఆర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ను సవరిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని.. మరి కొద్ది రోజులు వాయిదా వేసి.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంఘాల నేతలు కోరారు. దీనికి ఆదిత్యనాథ్ దాస్ అంగీకరించలేదు. ఈ సమయంలో షెడ్యూల్ వాయిదా కుదరదన్నారు.
కేంద్రం ప్యాకేజీ ఇవ్వండి..
ఈ సందర్భంగా సంఘాల నేతలు కొన్ని డిమాండ్లను సీఎస్ ముందు ఉంచారు. ఎన్నికల విధులు నిర్వహించే సమయంలో కరోనా మహమ్మారి బారిన పడే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీని అందజేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను తెలియచేద్దామంటే ఎన్నికల కమిషనర్ సమయమివ్వడం లేదని సంఘాల నేతలు చెప్పారు. తమకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే.. తమ అభిప్రాయాలను వివరిస్తామన్నారు. కమిషనర్తో భేటీకి ప్రయత్నం చేస్తానని సీఎస్ తెలిపారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
న్యాయం జరగలేదు. కానీ...: వెంకటరామిరెడ్డి,
రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్
‘‘భయాందోళనలకు గురి అవుతున్న ఉద్యోగులకు న్యాయం జరగలేదు. అయినప్పటికీ సుప్రీం తీర్పును గౌరవించి ఎన్నికలకు సహకరిస్తాం.మా మీద వ్యాఖ్యలు చేసినందునే ఎస్ఈసీపై స్పందించాం. కానీ, ఎన్నికల కమిషన్ మమ్మల్ని వివాదంలోకి లాగి వదిలివేసింది.’’
నచ్చచెబుతాం : చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం
‘‘ఎన్నికల విధుల్లో మేం పాల్గొంటాం. కరోనా ప్రాణభయంతో ఎన్నికలను బహిష్కరించాలని, సమ్మె చేయాలని ఉద్యోగులు భావించారు. అంతలా వారు బాధపడుతున్నారు. తమ ఆరోగ్యాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రభుత్వం త గిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినందున ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం.’’
రీ షెడ్యూల్ కోరాం: బొప్పరాజు, ఏపీ జేఏసీ అమరావతి
‘‘ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి వీలుగా కొద్ది రోజులు నోటిఫికేషన్ను రీ షెడ్యూల్ చేసేలా ఎస్ఈసీతో చర్చించాలని సీఎ్సను కోరాం. ఉద్యోగుల ప్రాణాలే కాకుండా, వారితో కలిసిఉండే కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండటంతో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాం. అలాగే, ప్రతి ఒక్క ఉద్యోగికీ పీపీఈ కిట్లను అందచేయాల్సిందిగా కోరాం’’ .
మా రక్షణకు ప్రభుత్వం హామీ : కేఆర్ సూర్యనారాయణ,
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
‘‘ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి ఉద్యోగులకు ఉన్న ఇబ్బందులను సీఎస్ దృష్టికి తీసుకు వెళ్లాం. ఉద్యోగుల రక్షణకు అన్ని చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. మేం ఎన్నికలను వ్యతిరేకించలేదు. ఉద్యోగుల ఆవే ద న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని మాత్రమే కోరాం’
0 Response to "All employees must participate in the election"
Post a Comment