Are you eligible? When is the list?
అర్హులెవరో..జాబితా ఎప్పుడో?
- పూర్తికాని పరిశీలన
- ఆందోళనలో అమ్మఒడి పథకం లబ్ధిదారులు
అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో మలి జాబితా ఎప్పుడన్నది ప్రశ్నార్థకం అవుతోంది. పథకం ప్రారంభించినప్పుడు ఎంపిక సరళతరంగానే ఉన్నా ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హుల ఎంపిక విషయంలో వడపోత కార్యక్రమం పలువురు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నెలాఖరునాటికే తుదిజాబితా ప్రకటించాల్సి ఉన్నా ఇంకా పరిశీలన కార్యక్రమమే పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సామాజిక తనిఖీ అనంతరం జాబితాలో తమపేరు ఉంటుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు.
అమ్మఒడి పథకానికి అర్హుల విషయంలో ప్రభుత్వం ఇటీవల చేసిన సూచనలకు అనుగుణంగా అధికారులు పరిశీలన కార్యక్రమం చేపట్టారు. తాజా నిబంధనల ప్రకారం గత ఏడాది లబ్ధిపొందిన వారిలో పలువురు ఈ ఏడాది అనర్హులుగా లెక్కతేలారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తం కావడంతో అనర్హులుగా ప్రకటించిన వారి అభ్యంతరాలను పరిశీలించి అవి అర్హమైనవిగా గుర్తిస్తే అర్హులుగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాకు సంబంధించినంత వరకూ 2019-21 సంవత్సరానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5.16 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి వారికి అమ్మఒడి పథకాన్ని వర్తింపచేశారు. ప్రస్తుత సంవత్సరానికి అధికార యంత్రాంగం తొలిగా 5.34 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన వారిలో అర్హులు(ఎలిజిబుల్), అనర్హులు (ఇన్ఎలిజిబుల్), విత్హెల్డ్ పేరుతో జాబితాలను విడుదల చేశారు. తక్కువ వేతనాలతో పనిచేసే అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, సచివాలయాల్లో తక్కువ వేతనాలతో పనిచేసే వారి పిల్లలు, ఆదాయపన్ను చెల్లించే వారు తదితర అంశాల ఆధారంగా కొందరి పేర్లను పథకానికి అనర్హులుగా గుర్తించారు. ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లలో పొరపాట్లు ఉన్న వారిని అర్హులుగా ఎంపిక చేయకుండా వారి జాబితాను విత్హెల్డ్లో ఉంచారు. ఈ ఏడాది ఎంపిక చేసిన వారిలో వివిధ కారణాలతో 80,936 మంది విద్యార్థులను అనర్హుల జాబితాలో, 6,162 మందిని విత్హెల్డ్లో ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందడంతో అన్ని స్థాయిల్లో అనర్హుల జాబితాలను పరిశీలించి అందులో అర్హులను ఎంపిక చేసి అమ్మఒడి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక పరిశీలనలో..
అభ్యంతరాల విషయాల్లో తప్పొప్పులను నిర్ధరించుకునే అవకాశం కల్పించి తుది జాబితాను గత ఏడాది డిసెంబరు నెలాఖరునాటికి ఖరారు చేయాలని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రాథమిక పరిశీలనలో 4.53 లక్షల మంది విద్యార్థులు పథకానికి అర్హులుగా గుర్తించారు. విజయవాడ అర్బన్ మండలంలో అర్హులైన విద్యార్థుల సంఖ్య 1,15,755 ఉండగా, అనర్హుల జాబితాలో 33,777 మంది విత్హెల్డ్ జాబితాలో 1,331 మంది ఉన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఇదే తరహా జాబితాలున్నాయి. వీటిల్లోని వారి వివరాలు పరిశీలించి అనర్హులు, అర్హుల జాబితాలను అప్లోడ్ చేయాల్సి ఉండగా రెండు మూడు రోజుల పాటు అమ్మఒడి పోర్టల్ పనిచేయకపోవడం సమస్యలకు తావిచ్చింది. అనర్హుల జాబితాలో ఉన్న వారి అభ్యంతరాలను పరిశీలన చేసి అర్హులుగా నిర్ధరణ అయితే వారి పేర్లను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఇందుకు ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించిన గడువు ముగిసిపోవడంతో సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అందరికీ ఒకేసారి లబ్ధి
అర్హులందరికీ అమ్మఒడి ద్వారా లబ్ధిచేకూరేలా డీఈవో ఆదేశాల మేరకు పరిశీలనా కార్యక్రమం కొనసాగుతోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోర్టల్ ఇబ్బందుల కారణంగా సామాజిక పరిశీలన కార్యక్రమం ఈనెల 5 వరకూ చేపడతారు. అనంతరం తుదిజాబితా ప్రకటించి అందరికి ఒకేసారి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు.
యూవీ సుబ్బారావు, డీవైఈవో
0 Response to "Are you eligible? When is the list?"
Post a Comment