Disinterest in universal education
సార్వత్రిక విద్యపై నిరాసక్తి
తగ్గిన ఓపెన్ స్కూళ్ల ప్రవేశాలు
మూసివేత దిశగా 40 కేంద్రాలు
జిల్లాలో కరోనా ప్రభావంతో ఓపెన్ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం నాలుగో విడతగా గడువు పొడిగించారు. గత ఏడాదితో పోల్చుకుంటే 30 శాతం నమోదు మాత్రమే జరగ్గా ప్రవేశాలు పెంచేందుకు ఆయా కేంద్రాల సమన్వయకర్తలు ప్రచారం చేపట్టారు. ఇటీవల మంత్రులు ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రచార పత్రాలు ఆవిష్కరింపజేశారు.
లక్ష్యం ఏమిటంటే..
అనివార్య కారణాలవల్ల విద్యకు దూరమైన వారు తిరిగి చదువుకోవడానికి తోడ్పడేదే సార్వత్రిక విద్య. దాని బోధనకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతికి రూ.1800, ఇంటర్కు రూ.2 వేల పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మామూలు ఉత్తీర్ణత పత్రంతో సమానమైన విలువ కలిగినది ఇస్తుండడంతో సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్ అనుత్తీర్ణులైన విద్యార్థులు వీటిని ఆశ్రయిస్తున్నారు.
ఈ ఏడాది ప్రతికూలత
సార్వత్రిక విద్యకు ఈ ఏడాది ప్రతికూల వాతావరణం ఏర్పడింది. కరోనా వల్ల పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందర్నీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణుల్ని చేయడంతో ఓపెన్ స్కూళ్లలో చేరాల్సిన అవసరం లేకపోయింది. సాధారణంగా ఏటా 10 నుంచి 15 శాతం మంది అనుత్తీర్ణులైన వారు వీటిల్లో చేరేవారు. ఈ సంవత్సరం కేవలం నాలుగో తరగతి ఉద్యోగులు, గృహిణులు మాత్రమే ప్రవేశాలు పొందారు. దీంతో కొన్నింట ఎవరూ చేరలేదు. కందుకూరు వివేకానంద, యర్రగొండపాలెం షీలా విద్యాసంస్థ, అదే కేంద్రంలో వాచస్పతి సంస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో వెలిగండ్ల, సీఎస్పురం, టంగుటూరు, హనుమంతునిపాడు తదితర కేంద్రాల్లో ఒక్కరూ చేరలేదు. ఈ ఏడాది కొత్తగా పది కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.
కనీస సంఖ్య ఉంటేనే కేంద్రం
జిల్లాలో సార్వత్రిక విద్య కేంద్రాలు మొత్తం 101 ఉండగా అసలు ప్రవేశాల్లేని 40 మూసివేయాలని నిర్ణయించారు. వాటిలో గత రెండేళ్లుగా ప్రవేశాలు లేనివి కొన్ని ఉన్నాయి. కనీసం 30 మంది విద్యార్థులు ఉంటేనే కేంద్రం కొనసాగిస్తారు.
విస్తృత ప్రచారం చేపడుతున్నాం
కరోనా వల్ల ప్రవేశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం 6 వేల మంది చేరారు. సార్వత్రిక విద్య ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం చేపడుతున్నాం. అసలు విద్యార్థుల్లేని కేంద్రాలు మూసివేయాలని నిర్ణయించుకున్నాం. గతేడాది విద్యావాలంటీర్ల నియామకం వల్ల విద్యార్హత కోసం ఎక్కువ మంది చేరారు. తాజాగా ఈ నెల 22 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించాం. - ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమన్వయకర్త, ఓపెన్ స్కూలు సొసైటీ.
0 Response to "Disinterest in universal education"
Post a Comment