The second installment of ‘Today-Today’ works from April 15
పాఠశాలల మరుగుదొడ్లపై ‘సులభ్’తో ఒప్పందం
ఏప్రిల్ 15 నుంచి ‘నాడు-నేడు’ రెండో విడత పనులు
‘నాడు-నేడు’పై సీఎం జగన్ సమీక్ష
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నియమించిన 49వేల మంది సిబ్బందికి సులభ్ సంస్థతో శిక్షణ ఇప్పించాలని సూచించారు. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండోవిడత కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, పక్కాగా నిర్వహించాలని సూచించారు.
యాప్ ద్వారా విద్యార్థుల హాజరు..
‘నాడు-నేడు’ రెండోవిడత పనులను ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబరు 31లోపు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని, ఇందుకు రూ.4,446 కోట్లు వ్యయం కానుందని వెల్లడించారు. మొదటి విడతకు సుమారు రూ.3,700 కోట్లు ఖర్చవుతోందని, పాఠశాలలను బాగు చేసేందుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పాఠశాలల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై సీఎంకు వివరాలు అందించారు. పిల్లల హాజరుపై యాప్ రూపొందించారా? లేదా? అని సీఎం ప్రశ్నించగా.. ఈనెల 15నుంచి పిల్లల హాజరు వివరాలను యాప్ ద్వారా సేకరిస్తామని అధికారులు వెల్లడించారు. పిల్లలు బడులకు గైర్హాజరైతే తల్లిదండ్రుల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వెళ్లాలని, రెండోరోజు వాలంటీరును పంపించి వివరాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు.
0 Response to "The second installment of ‘Today-Today’ works from April 15"
Post a Comment