1,03,558 corona cases as never before
లక్ష దాటేశాయ్!
- గతంలో ఎన్నడూ లేనంతగా 1,03,558 కరోనా కేసులు
- అమెరికా తర్వాత లక్ష దాటింది భారత్లోనే
- వరుసగా మూడోరోజు ప్రపంచంలో అత్యధికం
76 రోజుల్లో
గతేడాది రోజువారీ కేసుల సంఖ్య 20,000 నుంచి గరిష్ఠంగా 97,894కు చేరడానికి 76 రోజులు పట్టింది.
25 రోజుల్లో
ఈ ఏడాది రోజువారీ కేసుల సంఖ్య 20,000 నుంచి 1,03,558కి చేరడానికి 25 రోజులే పట్టింది.
దేశంలో కరోనా విలయతాండవం నూతన గరిష్ఠ స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజులోనే 1,03,558 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 1,25,89,067కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసుల్లో వరుసగా మూడోరోజు అమెరికా, బ్రెజిల్లను దేశం అధిగమించింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో కేసుల వేగం విపరీతంగా పెరిగిపోయింది. మహారాష్ట్రలో ప్రతిరోజూ సరికొత్త రికార్డు నమోదవుతూ వస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్లలో గతంలో ఎన్నడూ లేనన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 17 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించిన గరిష్ఠ సంఖ్యలో నమోదయ్యాయి.
కొత్తగా 478 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,65,101ని తాకింది. గతేడాది సెప్టెంబర్ 17న 97,894 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో అదే అత్యధికం.
కొత్త కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ల నుంచే 81.90 శాతం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
మార్చి నెల మొత్తం కలిపి 10,52,604 (రోజుకు 33,955 చొప్పున) కేసులురాగా ఏప్రిల్ నెల తొలి 5 రోజుల్లోనే 4,39,732 (రోజుకు 87,946.4 చొప్పున) కేసులు వచ్చాయి.
ఈ నెల 4న దేశవ్యాప్తంగా 8,93,749 నమూనాలను పరీక్షించామని, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 24,90,19,657కు చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సోమవారం తెలిపింది.
అమెరికాలో ఇప్పటివరకు గరిష్ఠంగా జనవరి 8న 3,08,978 కేసులు నమోదుకాగా, బ్రెజిల్లో మార్చి 25న 97,586 వచ్చాయి. ప్రస్తుతం కేసుల పరంగా తొలి మూడుస్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్లు కొనసాగున్నాయి. ఒక్క రోజులో లక్షకుపైగా కేసులు నమోదైంది మాత్రం అమెరికా, భారత్లలోనే.
దేశంలో ఒక్క ఆదివారమే క్రియాశీల కేసుల్లో 50,223 మేర పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళకర పరిణామం. దీంతో దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 7,41,830కి చేరగా, మొత్తం కేసుల్లో వీటి వాటా 5.89%గా ఉంది. మరోవైపు, కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి శాతం 92.80కు పడిపోయింది.
మహారాష్ట్రలో 222 మంది మృతి
కొవిడ్-19 కారణంగా ఆదివారం దేశంలో సంభవించిన 478 మరణాల్లో 222 ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం ఆ రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. గతేడాది సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా సంభవించిన 1,132 మరణాలతో పోల్చితే ఇప్పుడు 58% తక్కువ నమోదుకావడం ఊరటనిచ్చే అంశం. కొత్త కేసుల్లో 55.11 శాతం (57,074) మహారాష్ట్రలోనే సంభవించాయి. మరణాల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో పంజాబ్(51), ఛత్తీస్గఢ్(36), ఉత్తర్ప్రదేశ్(31), కర్ణాటక(15)లు ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ రోగాలతో బాధపడే వారే ఎక్కువగా కరోనా కాటుకు బలవుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పునరుద్ఘాటించింది. 12 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఎలాంటి మరణాలూ నమోదవలేదు.
పాఠశాలల మూసివేత బాటలో రాష్ట్రాలు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాఠశాలలను మూసివేస్తున్నాయి. పాఠాలు ఆన్లైన్లో బోధించాల్సిందిగా కోరుతున్నాయి. దిల్లీ, తమిళనాడు, గుజరాత్లు పాఠశాలలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, పంజాబ్, మరికొన్ని రాష్ట్రాలు కొద్దిరోజుల పాటు పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశాయి.
8న ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో సమావేశం విధానంలో నిర్వహించనున్న ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి, కరోనా టీకాల కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు సమాచారం. కాగా కేసులు అధికంగా నమోదవుతున్న కర్ణాటక సహా 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం భేటీ అవనున్నారు.
శిర్డీ ఆలయం మూసివేత
మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో శిర్డీలోని సాయిబాబా మందిరాన్ని తదుపరి ఆదేశాలు వెలువరించేవరకు మూసివేస్తున్నట్లు ఆలయవర్గాలు ప్రకటించాయి. ‘‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మతపరమైన ప్రాంతాలను మూసివేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నేపథ్యంలో సాయిబాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నాం’’ అని శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తాత్కాలిక సీఈవో రవీంద్ర ఠాక్రే తెలిపారు. ఆలయంలో నిత్యపూజలు యథావిధిగా జరుగుతాయని, భక్తులను మాత్రం అనుమతించబోమని స్పష్టంచేశారు. వసతి సముదాయాల్ని మూసివేస్తామన్నారు.
0 Response to "1,03,558 corona cases as never before"
Post a Comment