Decreasing student attendance in schools
పదో తరగతిపైనా కొవిడ్ పంజా
వెలుగుచూస్తున్న కరోనా కేసులు
పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు
కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల హాజరు తగ్గుతోంది. భయంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బడులకు పంపించేందుకు ఇష్టపడడం లేదు. కొన్ని బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారినపడుతున్న ఘటనలు వెలుగుచూస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే బడులను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ బడుల్లో వసతిగృహాలను కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థల్లో ఎన్ని నిబంధనలు అమలు చేసినా విద్యార్థులు గుంపులు, గుంపులుగా కలవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే పాఠ్యప్రణాళిక దాదాపుగా పూర్తయింది. పరీక్షల కోసం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసమే విద్యార్థులను బడులకు రప్పించడంపై విద్యావేత్తలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
పాజిటివ్ కేసు నమోదైతే ఆందోళన..
పాఠశాలల్లో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎవరికి కరోనా సోకినా దీని వ్యాప్తి అధికంగా ఉంటోంది. గుంటూరులో ఒక ఉపాధ్యాయుడికి కరోనా రావడంతో ఆయన కుటుంబసభ్యులకు అది సోకింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు బడులకు వచ్చేందుకు బస్సులు, ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కరోనా బారినపడే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. బడిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే అందరికీ పరీక్షలు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు, మూడు రోజులు సెలవులు ఇచ్చి, మళ్లీ బడులను తెరుస్తున్నారు.
- గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురం ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. మరో ఉపాధ్యాయుడి కుటుంబసభ్యులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు.
- విజయనగరం కస్పా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్గా తేలగా.. మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయి. అయినా సోమవారం వరకు మాత్రమే సెలవులు ప్రకటించారు.
- విజయవాడ విద్యాధరపురం రామరాజ్యనగర్ జీఎన్ఆర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్గా తేలింది. ఈ బడిలో 90మందికి పైగా పదోతరగతి విద్యార్థులున్నారు. ఐదు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
- ప్రకాశం జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం తర్వాత, సెలవు దినాల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులను రద్దు చేశారు.
- 60శాతంలోపే హాజరు..
- కేసులు పెరుగుతున్నందున చాలా చోట్ల పిల్లల్ని పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. సరాసరిన 60శాతం హాజరు మించడం లేదు.
- గుంటూరులోని స్తంభాలగరువు ప్రాంతంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 165మంది ఉండగా.. శుక్రవారం కేవలం 8మంది మాత్రమే హాజరయ్యారు.
- నెల్లూరు వెంగళరావునగర్లోని ఉన్నత పాఠశాలలో 70మంది పదో తరగతి పిల్లలు ఉండగా.. కేవలం 30మంది మాత్రమే వచ్చారు.
- అనంతపురం జిల్లా హిందూపురంలోని మహాత్మాగాంధీ పురపాలక పాఠశాలలో 212మంది ఉంటే వంద మంది హాజరయ్యారు.
- శ్రీకాకుళం చేపలవీధి నగరపాలక బాలికోన్నత పాఠశాలలో 46మంది ఉండగా.. కేవలం 9మంది మాత్రమే తరగతులకు వచ్చారు.
0 Response to "Decreasing student attendance in schools"
Post a Comment