Karonaa update
దేశంలో ఒక్క రోజులో లక్షన్నర
- 839 మంది మృతి
- మహారాష్ట్రలో స్థిరంగా పరిస్థితులు
- మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి
దేశంలో కరోనా ఇంతింతై అన్నట్లు విస్తరిస్తోంది. ఒక్క రోజులో 1,52,879 కేసులు, 839 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులకు సంబంధించి తాజాగా మరోమారు నూతన గరిష్ఠం నమోదైంది. మరణాల విషయానికి వస్తే ఈ ఏడాది ఇదే అత్యధికం. ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, దాద్రానగర్హవేలీల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 19 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించిన కేసులు నమోదయ్యాయి. రోజూ మాదిరిగానే పది రాష్ట్రాల నుంచి 80.92% కేసులొచ్చాయి. మహారాష్ట్రలో ఇప్పటికే అత్యధిక కేసులు వస్తుండగా ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్లలో పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 53.80% కేసులొచ్చాయి. మహారాష్ట్ర వాటా ఇదివరకు 55% వరకు ఉండగా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరగడంతో 36.24%కు తగ్గింది. తాజాగా ఆ రాష్ట్రంలో కేసులు తగ్గాయి. గత అయిదు రోజులుగా రోజురోజుకీ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లు ఉండగా, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, హరియాణా, పంజాబ్, తెలంగాణల్లో ఓ మోస్తరు హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. తాజాగా క్రియాశీల కేసుల సంఖ్య ఇదివరకు ఎన్నడూ లేనంతగా 11,08,087కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో వీటి నిష్పత్తి 8.29%కి ఎగబాకింది. 70.82% క్రియాశీల కేసులు కేవలం ఏడు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, పంజాబ్ల తర్వాత ఒక్క రోజులో వంద మందికిపైగా మరణాలు సంభవించిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ (123 మరణాలు) రికార్డులకు ఎక్కింది.
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 1,33,58,805 మంది వైరస్ బారిన పడ్డారు. 1,69,275 మంది మరణించారు.
వరుసగా 32వ రోజూ క్రియాశీల కేసుల్లో పెరుగుదల నమోదైంది.
ఈ నెల 10వ తేదీ వరకు 25,66,26,850 నమూనాలను పరీక్షించామని, ఒక్క శనివారమే 14,12,047 పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి ఆదివారం ప్రకటించింది.
0 Response to "Karonaa update"
Post a Comment