Rs 2000 Scheme: Rs 2 thousand per month .. How to apply .. Government has issued guidelines
Rs 2000 Scheme : నెలకు రూ .2 వేలు ఎలా అప్లయ్ చేసుకోవాలి .. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
Private School Teachers Rs 2000 Scheme : కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల రూ.2వేలు నగదుతో పాటు 25కిలోలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం విదితమే. ఈ నెల(ఏప్రిల్) నుంచే అర్హుల ఖాతాల్లోకి రూ.2వేలు ప్రభుత్వం వేయనుంది.
ఆధార్, బ్యాంకు ఖాతా మస్ట్:
తాజాగా ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయం పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి టీచర్ల వివరాలను ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నట్లు వెల్లడించింది.
10 నుంచి 15వ తేదీ వరకు వివరాల సేకరణ:
ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు స్కూల్స్ నుంచి వివరాల సేకరణ, 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వాటి పరిశీలన, ధ్రువీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే నెల 20 నుంచి 24 తేదీల్లో అర్హులైన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున నగదు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే 21 నుంచి 25వ తేదీ వరకూ ఉచితంగా 25కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
సీఎం కేసీఆర్ పెద్ద మనసు:
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కూల్స్ తిరిగి తెరిచే వరకు వారికి రూ.2వేలు ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు.
1.45లక్షల మంది.. నెలకు రూ.42కోట్లు:
ఈ నెల(ఏప్రిల్) 20 నుంచే ఆర్థిక సాయం అందజేయనుంది ప్రభుత్వం. 20వ తేదీ నుంచి 24వ తేదీ లోపు.. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు డిపాజిట్ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 10 నుంచి 15వ తేదీ వరకు విద్యాశాఖ… అర్హులైన వారి వివరాలను జిల్లాలకు పంపిస్తుందని.. 16 నుంచి 19వ తేదీ వరకు పరిశీలన, లబ్దిదారుల గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే రేషన్ షాపుల ద్వారా 25కిలోల బియ్యం ఇస్తామన్నారు. దాదాపు 1.45లక్షల మంది టీచర్లు, సిబ్బంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
తిరిగి స్కూళ్లు ఓపెన్ అయ్యే వరకు సాయం:
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెలా రూ.2వేలు నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి.. వేతనాల్లేక కుటుంబాన్ని పోషించుకోలేని దయనీయ స్థితిలో ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ప్రైవేట్ టీచర్ కుటుంబం(భర్త, భార్య) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆలోచించి ప్రైవేట్ టీచర్లకు నగదు సాయంతో పాటు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.
కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచరు కుటుంబం ఛిన్నాభిన్నం:
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొంతమందిని నేరుగా కాటేస్తుండగా మరికొందరిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేసి ఉసురు తీసేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ప్రైవేట్ స్కూల్ టీచర్(వనం రవికుమార్-31) మంగళవారం(ఏప్రిల్ 6,2021) ఆత్మహత్య చేసుకున్నాడు. అది మరవకముందే ఆ ఇంట మరో విషాదం.. ఆయన భార్య మృతదేహం బుధవారం(ఏప్రిల్ 7,2021) రాత్రి వాగులో లభ్యమైంది. అలా.. కరోనా వైరస్ మహమ్మారి.. ఓ ప్రైవేట్ టీచర్ కుటుంబాన్ని చిన్నాబిన్నం చేసింది.
0 Response to "Rs 2000 Scheme: Rs 2 thousand per month .. How to apply .. Government has issued guidelines"
Post a Comment