Ten students confused, ever clarity on ten exams
పది పరీక్షలపై స్పష్టత ఎప్పుడో, అయోమయంలో పది విద్యార్థులు
ఒక పక్క కరోనా విజృంభిస్తోంది. మరోవైపు పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వలె రద్దు చేస్తారా లేక పరీక్షలు నిర్వహిస్తారా అనేది తేలకపోవడంతో అయోమయం నెలకొంది. ఒకవేళ పెడితే కొవిడ్ బారిన పడాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ ఏడాది సిలబస్ను కుదించినా పలు పాఠశాలల్లో కొన్ని పాఠ్యాంశాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలియడంలేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.
గతేడాది కొవిడ్ ప్రభావంతో పాఠశాలలను ఆలస్యంగా ప్రారంభించారు. అంతకుముందు ఆన్లైన్లో తరగతులను కొనసాగిస్తూ వచ్చారు. చరవాణీలు లేని గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు రూపొందించిన పాఠ్యాంశాలను జిరాక్స్లు తీసి అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఈ విద్యాసంవత్సరంలో చదువులు ఆగుతూ..సాగుతూ అన్నట్లుగా తయారయ్యాయి. తరువాత పరిస్థితి కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో మళ్లీ కొవిడ్ మహమ్మారి విజృంభించడం ప్రారంభించింది. మళ్లీ బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందించిన బోధనను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో సిలబస్పూర్తి కాలేదు. దీనికితోడు పలు పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గూడూరు, బందరు, ఘంటసాల, పెడన ఇలా బందరు డివిజన్ పరిధిలోని పలు పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా బోధన సాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా వివిధ కారణాలతో పాఠాలు ముందుకు సాగలేదు. పరీక్షా విధానంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది అంతా ఇలా గందరగోళంగానే సాగింది.
తగ్గుతున్న హాజరు
కొవిడ్ కేసులు విస్తృతంగా నమోదవుతున్న కారణంగా ప్రభుత్వం 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్చేస్తూ ఆ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం నిర్దేశించిన సమయం మేరకు తరగతులు జరుగుతాయని చెప్పినా పాఠశాలలకు ఆశించిన స్థాయిలో పిల్లలు రావడం లేదు. పలు పాఠశాలల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా కొవిడ్ బారిన పడటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో మొత్తం విద్యార్థుల్లో సగం మేర కూడా హాజరు కావడం లేదు. రోజు రోజుకు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు ప్రత్యేక తరగతులు కూడా నిలిపివేశారు. మరోవైపు ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ 100రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ఉన్న ఉపాధ్యాయులను బట్టి ఒక్కొక్కరికి 10మంది విద్యార్థులను దత్తత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సైతం బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ మొదటి వారంలో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే నెలరోజులు మాత్రమే సమయం ఉంది.
ప్రత్యేక తరగతులు రద్దు చేశాం
ప్రస్తుతం 1నుంచి 9 తరగతులు లేనందున పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల వరకు సాయంత్రం 4గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. నాలుగురోజులుగా విద్యార్థుల తల్లిదండ్రుల కోరికమేరకు వాటిని రద్దు చేశాం. సిలబస్ అన్ని చోట్లా పూర్తయ్యింది. ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలను రివిజన్ చేయిస్తున్నాం. అయితే కొవిడ్ భయంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గింది. పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
యూవీ సుబ్బారావు, డీవైఈవో
బడికి పంపాలంటే భయం
కొవిడ్ కేసులు విస్తృతంగా పెరగడంతో పిల్లల్ని బడికి పంపాలంటే భయపడిపోతున్నాం. పదో తరగతి కావడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపిస్తున్నా ఆందోళనగానే ఉంటోంది. పరీక్షలు జరుగుతాయని అంటున్నారు.. మరోవైపు పరిస్థితులను బట్టి సమీక్షించి నిర్ణయం చెబుతామంటున్నారు. ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. - తుమ్మల సుధారాణి, మల్లవోలు, గూడూరు మండలం
దృష్టి పెట్టలేకపోతున్నాం
పరీక్షలకు సన్నద్ధమవుతున్నాం కానీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాం. ఎందుకంటే పరీక్షలు ఉంటాయని కష్టపడి చదువుతున్నా.. ఉండవేమోననే సందేహంతో మళ్లీ అలసత్వం వస్తోంది. ప్రస్తుతానికి ప్రత్యేక తరగతులు నిలిపివేసినా ఉపాధ్యాయులు ఆయా పాఠ్యాంశాలను రివిజన్ చేయిస్తున్నారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇస్తే విద్యార్థులందరికీ ఉపయోగంగా ఉంటుంది. - పి.సంతోష్, కోన, బందరు మండలం
0 Response to "Ten students confused, ever clarity on ten exams"
Post a Comment