Stress with exam postponements
పరీక్షల వాయిదాలతో ఒత్తిడి
- పది, ఇంటర్ పరీక్షలపై స్పష్టత కరువు
- పుస్తకాలు పట్టే ఉండాలంటున్న తల్లిదండ్రులు
- ఆటలు, టీవీ జోలికి పోవద్దంటూ హెచ్చరికలు
- చదివిందే ఎంతకాలం చదవాలి?
- విద్యార్థుల మనోవేదన
- ఒత్తిడి చేయొద్దంటున్న నిపుణులు
పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. అసలు జరుగుతాయో.. లేదో కూడా చెప్పలేని పరిస్థితి. చదివిందే మళ్లీ మళ్లీ చదవాలంటే బోర్. కానీ పుస్తకాలపైనే దృష్టిపెట్టాలంటున్న తల్లిదండ్రులు. టీవీ, ఫోన చూడనివ్వక, ఆటలాడుకోనివ్వకుండా కట్టడి.... ఇదీ ప్రస్తుతం పదోతరగతి, ఇంటర్ విద్యార్థుల పరిస్థితి. అటు ప్రభుత్వం స్పష్టత ఇవ్వక, ఇటు తల్లిదండ్రు లు సడలింపులు ఇవ్వక ఆ విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా రక్కసి వారిని పరోక్షంగా వేధిస్తోంది.
నెల్లూరు(స్టోనహౌస్పేట), మే 28 : కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది. పదో తరగతి, ఇంటర్ వారికి మాత్రం కొంతకాలం క్లాసులు జరిపి, కరోనా కేసులు పెరగడంతో విద్యా సంస్థలను పూర్తిగా మూసేసింది. అయితే పది, ఇంటర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు జరిపి తీరుతామని ప్రకటించింది. కానీ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. పరీక్షల తేదీలను తరచూ మార్చుకుంటూ పోతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని వాయిదా వేసింది. పరీక్షల అంశం కోర్టుకు చేరడంతో పదో తరగతి పరీక్షలనూ వాయిదా వేసింది. వాటి నిర్వహణపై జూలైలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి తెలిపింది. దీనినిబట్టి జూలై వరకు పరీక్షలు జరిగే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సమస్యగా మారింది. పరీక్షలకు చదవాలో.. లేక కొత్త తరగతులకు సిద్ధపడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
మానసిక ఒత్తిడి
గతంలో కాలేజీ, క్లాసులు, స్టడీ అవర్, ట్యూషన అంటూ రోజంతా బిజీగా ఉండే విద్యార్థులు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఉంటున్నప్పటికీ ఆటపాటలు, స్నేహితులతో సరదా కబుర్లు కరువై మానసిక ఉల్లాసాన్ని కోల్పోతున్నారు. కాసేపు స్మార్ట్ ఫోన, టీవీ, కంప్యూటర్తో కాలక్షేపం చేద్దామనుకుంటే.. ‘పరీక్షలు ఉన్నాయి.. చదువుకో!’ అంటూ తల్లిదండ్రులు గదమాయిస్తున్నారు. అయితే ఎప్పుడు జరుగుతాయో తెలియని పరీక్షలకు ఎన్నాళ్లు చదవాలి?, చదివిన సిలబస్నే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదువుతూ ఉండాలి..! అంటూ పిల్లలు విసుక్కుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మనోవేదనతో సతమతమవుతున్నారు.
ఒత్తిడి చేయొద్దు
పది, ఇంటర్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. సహజంగా అధ్యాపకులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతుంటారు. అయితే ఈ సంవత్సరం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఇళ్లలోనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పరీక్షలకు సంబంధించిన సిలబస్తోపాటు జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షలు, స్వాతంత్య్ర సమరయోధుల కథలు వంటివి తెలియజేస్తే విద్యార్థులకు విజ్ఞానంతోపాటు కాస్త ఆటవిడుపుగానూ ఉంటుంది.
బాబూ జాకబ్, రిటైర్డ్ ఆర్ఐవో
అన్నీ అవసరమే!
పిల్లలు చాలా సున్నిత మనస్కులు. వారిని పరీక్షలు, చదువు అంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం మంచిది కాదు. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు, ఫిట్నెస్, ఆనందం అన్నీ అవసరం. అందుకు తగ్గట్లుగా తల్లిదండ్రులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. రెండు గంటలసేపు చదువుకుంటే మరో రెండు గంటలసేపు ఆటలకు, వినోదానికి అవకాశం ఇవ్వాలి. వారితో ప్రేమగా ఉంటూ ముందుకు నడిపించాలి.
డాక్టర్ సురేష్బాబు, మానసిక వైద్య నిపుణుడు
0 Response to "Stress with exam postponements"
Post a Comment