CBSE exams in two phases
రెండు దఫాలుగా సీబీఎస్ఈ పరీక్షలు
- 10, 12వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మదింపు
- నవంబరు-డిసెంబరులో టర్మ్-1, మార్చి-ఏప్రిల్లో టర్మ్-2
- తదనుగుణంగా సిలబస్ హేతుబద్ధీకరణ
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) సోమవారం ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించింది. అకాడమిక్ సెషన్ను రెండు భాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తదనుగుణంగా సిలబస్ను హేతుబద్ధీకరిస్తామని తెలిపింది. అంతర్గత మదింపు, ప్రాజెక్టు వర్కులు మరింత విశ్వసనీయంగా ఉండేలా చూస్తామని పేర్కొంది. సీబీఎస్ఈ డైరెక్టర్ (అకాడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా విధానం ప్రకారం.. టర్మ్-1 పరీక్షలను ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో, టర్మ్-2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో నిర్వహిస్తారు. టర్మ్-1 పరీక్షల్లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. ఒక్కో పరీక్ష నిడివి 90 నిమిషాలు. సీబీఎస్ఈ నియమించిన ఎక్స్టర్నల్ సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకుల పర్యవేక్షణలో అవి జరుగుతాయి. బోర్డు నిర్ణయించిన సెంటర్లలో టర్మ్-2 పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పరీక్ష నిడివి రెండు గంటలు. ఇందులో బహుళ రూపాల్లో (వ్యాసరూప, సంక్షిప్త సమాధాన..) ప్రశ్నలు ఇస్తారు. ఒకవేళ డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహణ సాధ్యం కాకపోతే.. టర్మ్-1 తరహాలో పరీక్షలు జరుగుతాయి.
0 Response to "CBSE exams in two phases"
Post a Comment