How to teach students ..?
విద్యార్థులకు పాఠాలెలా..?
- ఈ నెల 12నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
- పుస్తకాలు లేకుండా తరగతులెలా?
- పాఠశాలలకు చేరినా విద్యార్థులకు అందించని వైనం
- 40శాతం మందికి స్మార్ట్ ఫోన్లూ లేవు..!
- బోధన ఎలా చేయాలో అర్ధంకాక ఉపాధ్యాయుల సతమతం
చదువుదామంటే పుస్తకం లేదు.. విందామంటే స్మార్ట్ ఫోన్ లేదు.. ఈ ఏడాది కూడా ఇంతేనా..? ఇదీ సగటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆవేదన. గత ఏడాది కరోనా మొదటి వేవ్ కారణంగా బడుల నిర్వహణ లేదు.. ఎలాగో పై తరగతులకు పంపారు. ఈ ఏడాది అదే పరిస్థితి. విద్యాసంవత్సరం మొదలైనా కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్కూళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ క్లాసులు అంటున్నా.. కనీసం పుస్తకాలు లేకుండా ఎలా వినాలనేది విద్యార్థుల ప్రశ్న. అసలు దాదాపు 60 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ఫోన్లే లేనట్లు సమాచారం. పుస్తకాలు, స్మార్ట్ఫోన్లు లేకుండా ఆన్లైన్ క్లాసులు చెప్పి ఏం ప్రయోజనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా రెండోదశ ఉధృతి తగ్గుతుండడంతో పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించి, వచ్చే నెల 16నుంచి పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవుతోంది. కాగా.. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపైనే పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతవరకు వాటిలో దాదాపు సగం పుస్తకాలు మండల, పాఠశాలస్థాయికి చేరాయి. పాఠశాలలకు చేరిన పుస్తకాలు ఇప్పటివరకు విద్యార్థులకు చేరనేలేదు. ఇంకోవైపు పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకుండా బోధన ఎలా చేయాలంటూ ఉపాధ్యాయులు మదన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయని సమాచారం.
విద్యార్థులకు చేరని పాఠ్య పుస్తకాలు.
వాస్తవంగా ఈ ఏడాది జూన్ 15 నాటికి పాఠశాలలు పునఃప్రారంభం కావాలి. అయితే కొవిడ్ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆగస్టు 16కి వాయిదా వేశారు. ఈ నెల రోజులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు వర్కుషీట్ల ద్వారా బోధన చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో విద్యార్థులకు 42.79 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా గత నెల 14కి 15.14 లక్షలకుపైగా పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిలో దాదాపు సగం పుస్తకాలు మండల, పాఠశాల స్థాయికి చేర్చారు. ఇప్పటివరకు పాఠశాల స్థాయికి చేరిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయలేదు. విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా రెండుసార్లు డ్రై రైస్, ఒకసారి కందిపప్పు అందజేశారు. ఇలాగే పుస్తకాలు కూడా అందజేసి ఉండవచ్చు. అయితే ఈ దిశగా అధికారులు ఆలోచన చేయలేదు. పైగా హడావుడిగా ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులో లేని స్మార్ట్ ఫోన్లు
జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 5,165 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 6.75 లక్షల మంది ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన సర్వేలో జిల్లాలో సెల్ఫోన్లు కలిగి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు 6.49లక్షలు అని తేల్చారు. అయితే ఇందులో స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి అనే విషయం కూడా పూర్తిస్థాయిలో తెలియలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయని సమాచారం. మిలిగిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రస్తుత ప్రశ్న..!
ప్రైవేటులో వేగంగా..
ఓ వైపు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ యాప్ల ద్వారా ఆన్లైన్ బోధన వేగవతంగా సాగుతోంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చదివే విద్యార్ధులు అందరూ పేద, బడుగు, బలహీన వర్గాలకులకు చెందిన వారే. ఈ నేపథ్యంలో ఫోన్లు లేనివారికి బోధన ఎలా చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది.
కేరళ ప్రభుత్వం తరహాలో స్పందించి ఉంటే.
కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల బోధనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి చదువు సాఫీగా సాగిపోయేలా కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి టాబ్స్ అందజేసింది. ఫలితంగా బోధనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విద్య సాగుతోంది. మన రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి అమ్మఒడి పథకం పేరుతో రూ.15వేలు అందిస్తున్నారు. ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడానికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు అయితే ఇంటి అవసరాలకే ఉపయోగిస్తున్నారు.
0 Response to "How to teach students ..?"
Post a Comment