The third threat is the beginning
ఆదమరిస్తే మూడో ముప్పు
- ప్రధాని మోదీ హెచ్చరిక
- రమ్మంటే తప్ప మరో వేవ్ రాదని వ్యాఖ్య
- కొవిడ్ నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు!
- జాగ్రత్తలతోనే మూడోవేవ్కు అడ్డుకట్ట
- కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
మనం రమ్మంటే తప్ప కరోనా మూడో వేవ్ రాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడో వేవ్ను ఎదుర్కోవడానికి ఏం ఏర్పాట్లు చేశారంటూ ప్రశ్నించడం మానేసి, అది రాకుండా ఏం చేయాలో ప్రశ్నించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా సంక్రమణ వేగం, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి కిషన్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని పలు కీలక అంశాలపై మాట్లాడారు. ‘‘కరోనా నియంత్రణ కోసం సూక్ష్మ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలి. అస్సాం ప్రభుత్వం అనుసరించిన మైక్రోకంటెయిన్మెంట్ తరహా చర్యలతో బాధ్యులైన వారిపై జవాబుదారీతనం పెరుగుతుంది.
ఇలా గత ఏడాదిన్నర కాలంలో మన అనుభవాలు, ఉత్తమ విధానాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇది బహురూప వైరస్. ప్రతి వేరియంట్పై దృష్టి సారించాలి. భౌతిక దూరం, మాస్క్, వ్యాక్సిన్ల వల్లే వైరస్ బలహీనపడుతుంది. ప్రజలంతా కరోనా నియంత్రణ ప్రవర్తనను అనుసరించేలా ప్రోత్సహించాలి. కరోనా కారణంగా పర్యాటకం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం హిల్స్టేషన్లు, మార్కెట్లలో మాస్కులు లేకుండా భారీ సంఖ్యలో జనాలు గుమికూడుతుండటం ఆందోళనకరం. మూడో వేవ్ రాకముందే మేం ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు కొందరు రొమ్ము విరుచుకొని చెప్పడం చూశాం. అయితే మూడో వేవ్ తనంతట తాను రాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. ప్రొటోకాల్ను కఠినంగా ఎలా అమలుచేయాలో ప్రశ్నించుకోవాలి. మనం నియమాలను సరిగా పాటిస్తే మూడో వేవ్ను అడ్డుకోవచ్చు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. టెస్టింగ్, ట్రీట్మెంట్కు సంబంధించిన మౌలిక వసతులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. ఇందుకోసం కేంద్ర కేబినెట్ రూ.23 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కేసులు పెరిగే చోట ఐసీయూ పడకలు పెంచాలి. ఆక్సిజన్, పిల్లల వైద్య వసతుల్ని సమకూర్చుకోవాలి. ర్యాండం టెస్టింగ్తో పాటు, క్లస్టర్ బ్లాకుల్లో పరీక్షలు చేయాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈశాన్య భారతంలో పీఎం కేర్స్ నిధి ద్వారా 150 ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.
వాతావరణ విశేషాల మాదిరిగా.. కొవిడ్ మూడో ఉద్ధృతి (థర్డ్ వేవ్)పై ప్రజలు యథాలాపంగా మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించకుండా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో మహమ్మారి నియంత్రణకు చేపట్టిన చర్యల ద్వారా ఇంతవరకు సాధించిన విజయాలు నిష్ఫలమవుతాయన్న ఆందోళనను వ్యక్తం చేసింది.
ఇప్పటికే పర్యాటక ప్రదేశాలు, కొండ ప్రాంతాలు వంటిచోట్ల కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు ఉదాసీనంగా ఉంటున్న విషయమై కేంద్రం పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా మూడో ఉద్ధృతిని చూస్తున్నామని.. ఇది భారత్ను తాకకుండా ఉండేందుకు ప్రజలంతా కృషి చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పిలుపునిచ్చారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్తో పాటు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం వైరస్కు - మనిషికి మధ్య ఆగని పోరు సాగుతోంది. దేశంలో మూడో ఉద్ధృతి రాకుండా ఉండాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనికి మనమంతా చేతులు కలపాలి. వాతావరణం కంటే మన వ్యవహారశైలే మూడో ఉద్ధృతికి కారణమవుతుంది. కొవిడ్ జాగ్రత్తలను సరిగా పాటించకపోవడం, ఉదాసీనంగా ఉండటమే భవిష్యత్తులో ఉద్ధృతులకు దారితీస్తాయన్నది తెలుసుకోవడంలో విఫలమవుతున్నాం’’ అని వీకే పాల్ స్పష్టం చేశారు. మనమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెప్పారు. దిల్లీ, చెన్నై, చండీగఢ్లతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోని వివిధ మార్కెట్లు, తదితర ప్రదేశాలు.. కొండ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా తిరుగాడుతున్న పరిస్థితులను లవ్ అగర్వాల్ ప్రస్తావించారు. దేశంలో కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నప్పటికీ.. ఉదాసీనతకు చోటివ్వరాదని పునరుద్ఘాటించారు. భారత్లోనూ ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. జులైలో ఇంతవరకు నమోదైన కేసుల్లో 73.4 శాతం కేరళ (30.3%), మహారాష్ట్ర (20.8%), తమిళనాడు (8.5%), ఆంధ్రప్రదేశ్ (7.3%), ఒడిశా (6.5%)ల్లోనే ఉన్నట్లు చెప్పారు.
0 Response to "The third threat is the beginning"
Post a Comment