What the students have learned is missing ..!
విద్యార్థులు నేర్చుకున్నదీ పోతోంది..!
కరోనా సమయంలోనే పైతరగతులకు.
‘విజయవాడలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులను ఇటీవల విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఒకటి నుంచి ఐదు వరకు విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులను ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. ఒక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని.. నాలుగు అక్షరాల చిన్న ఆంగ్ల పదాన్ని రాసి చూపించమని విద్యాధికారి అడిగారు. స్పెల్లింగ్ తప్పు చెబితే పర్వాలేదు. కానీ స్పెల్లింగ్లో ఉండే అక్షరాలను చెబుతున్నా.. వాటిని కూడా ఎలా రాయాలో తెలియక విద్యార్థి అయోమయంగా చూడడం గమనార్హం. ఐదో తరగతి విద్యార్థి అక్షరాలను మరచిపోవడంతో విద్యాధికారికి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.’
ప్రస్తుతం చాలా మంది విద్యార్థులది ఇదే పరిస్థితి.
వాస్తవంగా అయితే.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి.. మూడో తరగతి వరకే పాఠశాలలో చదివాడు. కొవిడ్ వల్ల ఇంటిలో ఉంటూనే ఒక తరగతి పైకి వచ్చేశారు. ఈ ఏడాది మరో తరగతి కూడా ఇంటి దగ్గర నుంచే ఆరంభమైంది. మూడు చదివేవాళ్లు ఐదుకు, నాలుగు నుంచి ఆరుకు.. తరగతి గదిలో అడుగుపెట్టకుండానే ఎక్కారు.
ఆన్లైన్లో తరగతులు నిర్వహించినా. అవి ఒకటి నుంచి ఐదు వరకు ఉండే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు.. దేనికీ పనికి రావడం లేదని అధికారులు, ఉపాధ్యాయులే చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లలో నిర్వహించే ఆన్లైన్ తరగతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో పెద్ద తరగతుల విద్యార్థులకే కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం తరగతులు పైకి వెళ్లినా.. అధికశాతం మంది విద్యార్థులు మాత్రం కొవిడ్కు ముందున్న స్టాండర్డ్స్లోనే ఆగిపోయారు. వాటినీ ప్రస్తుతం మరచిపోతున్నారు.
స్మార్ట్ఫోన్లోనే లోకం..
ప్రస్తుతం స్మార్ట్ఫోనే విద్యార్థులకు లోకంగా మారిపోయింది. గతంలో ఫోన్ పట్టుకుంటే మందలించే తల్లిదండ్రులు.. ఇప్పుడు బతిమాలి మరీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దాంతో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతుల పేరుతో అదేపనిగా ఫోన్తోనే గడుపుతున్నారు. తరగతులకు మధ్యలో వచ్చే ఖాళీ సమయం, సాయంత్రం తర్వాత కూడా ఫోన్లో ఆటలు, వీడియోలు చూసుకుంటున్నారు. దీంతో పూర్తిగా ఫోన్కు బానిసలుగా మారిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల మెదడుపై తీవ్ర ప్రభావం పడి మతిమరుపు, మొండితనం వంటివి వచ్చేస్తున్నాయి. తల్లిదండ్రుల్లోనూ చాలా మంది స్మార్ట్ఫోన్ గురించి పెద్దగా తెలియని వాళ్లున్నారు. అధిక శాతం ఆన్లైన్ తరగతుల కోసమే ఫోన్లను కొన్నారు. ఇలాంటి ఇళ్లలో విద్యార్థులకు పూర్తిగా అడ్డులేకుండా పోతోంది.
పూర్తిగా గాడి తప్పింది..
ఏడాదిన్నర కాలంలో విద్యార్థుల్లో రోజువారీ దినచర్య పూర్తిగా గాడి తప్పింది. ఉదయాన్నే లేవడం, పాఠశాలకు బయలుదేరి వెళ్లడం, సమయానికి తినడం, త్వరగా నిద్రపోవడం.. లాంటి రోజువారీ దినచర్య ఇప్పుడు లేదు. నచ్చిన సమయానికి నిద్రపోవడం, లేవడం.. సమయానికి తినకపోవడం.. వంటి వాటితో విద్యార్థుల్లో ఒకరకమైన నిర్లక్ష్యం పెరిగిపోయిందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆన్లైన్ తరగతులు అయిపోగానే వారిని స్మార్ట్ఫోన్ నుంచి విడదీయాల్సిన అవసరం ఉంది.
సరైన పర్యవేక్షణ లేదు.
ఆన్లైన్ తరగతుల విషయంలో విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. వారికి ఓ స్మార్ట్ఫోన్ను ఇచ్చేసి చాలా మంది వదిలేస్తున్నారు. వాళ్లు తరగతులు వింటున్నారా.. లేక మరేదైనా చేస్తున్నారా.. అనే పర్యవేక్షణ ఉండడం లేదు. ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయాన్నే విద్యార్థికి సంబంధించిన ఆన్లైన్ తరగతులు ఏ సమయంలో ఉంటున్నాయి, ఎప్పుడెప్పుడు ఖాళీ ఉంది, ఎప్పుడు ముగుస్తాయనేది కచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఏ రోజుకు ఆరోజు ఉపాధ్యాయులు ఏం నేర్పించారు, వీరికి ఏం వచ్చిందనేది అడిగి తెలుసుకోవాలి. ఖాళీ సమయంలో వారు స్మార్ట్ఫోన్లో ఇతర వీడియోలు చూస్తూ గడపడం వంటివి నివారించాలి.
దిద్దుబాటు ఆరంభించాలి.
ప్రస్తుతం ఆన్లైన్ తరగతుల వల్ల విద్యార్థులు ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులకే దగ్గరగా ఉంటున్నారు. గత ఏడాదిన్నరగా ఇంటిలోనే ఉంటున్న చిన్నారులను తిరిగి గాడిలో పెట్టే అవకాశం తల్లిదండ్రులకే ఉంది. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల్లో తిరిగి పూర్వపు స్థితిని తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు కొద్దిగా శ్రమించాల్సిన అవసరం ఉంది. వారిలో ఉత్తేజం నింపేలా.. ప్రతి రోజూ పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను వివరించడం, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అక్షరాలు, పదాలు, వాక్యాలను రాయిస్తూ ఉండాలి. ఆన్లైన్ తరగతులైనప్పటికీ వారిని సమయానికి నిద్రలేపడం, సరిగ్గా తరగతులకు హాజరయ్యేలా చేయడం వంటివి అలవాటు చేయాలి. చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు మధ్యలో రావడం, కొంత మంది మొదటి పిరియడ్ను వదిలేసి.. రెండో దాని నుంచి హాజరవుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీనిని నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.
ప్రవర్తనలో బాగా మార్పులొచ్చాయి..
డాక్టర్ రాధికారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి
ప్రస్తుతం పిల్లలు ప్రతి విషయానికి చిరాకు పడడం, అరవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం వంటి సమస్యలే ఉంటున్నాయి. రోజువారీ దినచర్య బాగా దెబ్బతినడం, సరైన శారీరక ఆటలు లేకపోవడంతో మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులను ఉత్తేజ పరిచేలా ఆన్లైన్ తరగతులు విభిన్నంగా ఉండాలి. అలా కాకుండా వారికి విసుగు తెప్పించేలా.. పాఠాలను చెప్పుకుంటూ వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. వారికి ఆసక్తిగా ఉండే విధానంలో బోధన జరగాలి. కొత్త కొత్త విషయాలను వారికి చెప్పాలి. తల్లిదండ్రులు కూడా వారిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి.
0 Response to "What the students have learned is missing ..!"
Post a Comment