How did the schools open?
స్కూళ్లు ఎలా తెరిచారు?
- కరోనాలో విద్యార్థుల భద్రత పట్టదా?
- ఈ నిర్ణయం తీసుకున్న మేధావులు ఎవరు?
- పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?
- కోర్టుల్లోనే ప్రత్యక్ష విచారణకు అనుమతి లేదు
- సచివాలయాల్లో కూర్చొని ఉత్తర్వులిస్తే చాలా?
- ఉపాధ్యాయులకు టీకాలు వేస్తే సరిపోతుందా?
- పిల్లలు, తల్లిదండ్రులకు వ్యాక్సిన్ మాటేమిటి?
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
- స్కూళ్ల ఆవరణలో సచివాలయాలపై దాఖలైన
- వ్యాజ్యం విచారణలో* *న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం
- విచారణకు ఏడుగురు ఐఏఎస్లు హాజరు
‘‘పాఠశాలలను తెరవడాన్ని పరువుప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావిస్తున్నారు తప్ప, పిల్లల ప్రాణాల గురించి ఆలోచించడం లేదు. కొవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాల్లోనే ప్రత్యక్ష విచారణలు చేపట్టడంలేదు. అలాంటప్పుడు పాఠశాలలు ఎలా తెరుస్తారు?ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్ణయాలు తీసుకోవడం లేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’ -హైకోర్టు
కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ పాఠశాలలు, కళాశాలలు తెరవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. కరోనాకాలంలో పాఠశాలలు తెరవడానికి ఏవిధంగా నిర్ణయం తీసుకున్నారంటూ న్యాయస్థానం ముందు హాజరైన పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించింది. విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. సచివాలయంలో కూర్చుని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. ఈ నిర్ణయం తీసుకున్న మేధావులు ఎవరంటూ మండిపడింది. ఉపాధ్యాయులకు టీకా వేస్తే సరిపోతుందా అని ప్రశ్నించింది. వారితోపాటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యాక్సిన్ వేయకుండా పాఠశాలలు తెరవడం ఏవిధంగా సముచితమని వ్యాఖ్యానించింది. ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్ణయం తీసుకోవడం లేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంది.
పాఠశాలలు తెరవడాన్ని పరువుప్రతిష్టకు సంబంధించిన అంశంగా భావిస్తున్నారు తప్ప పిల్లల ప్రాణాల గురించి ఆలోచించడం లేదని వ్యాఖ్యానించింది. కొవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాల్లోనే ప్రత్యక్ష విచారణలు చేపట్టడంలేదని, అలాంటప్పుడు పాఠశాలలు ఎలా తెరుస్తారని నిలదీసింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని పరిషత్ పాఠశాలలో ఉన్న రెండు గదుల్లో ఒక దాంట్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్వహిస్తుంటే.. రెండో గదిలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించింది. పాఠశాలల ఆవరణలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఖాళీ చేయించాలని అధికారులకు స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేస్తూ విచారణను అక్టోబరు ఒకటికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఆదేశాలిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేయకుండా చర్యలు తీసుకోవాలని గత ఏడాది జూన్లో జారీచేసిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, కోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరయ్యారు. పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఆ శాఖ కమిషనర్ వీ చినవీరభధ్రుడు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఈ శాఖ అప్పటి డైరెక్టర్ జీ విజయ్కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ కోర్టు ముందు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హాజరునుంచి మినహాయింపు పొందారు.
అధికారుల తరఫున న్యాయవాదులు కాసా జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ జీపీ రఘువీర్ వాదనలు వినిపించారు. ‘‘పాఠశాలల్లో ఉన్న గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఖాళీ చేయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని ఖాళీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచాం’’ అని తెలిపారు. ఆ వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఖాళీ చేయిస్తే ఇంకా పాఠశాలల్లోనే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు.
‘హైకోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే తగిన చర్యలు తీసుకోవాలని దిగువ అధికారులకు మెమోలు జారీ చేస్తున్నారు. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన తరువాత అధికారులు చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్పందిస్తూ...‘‘రాష్ట్రంలోని మొత్తం 1,170 పాఠశాలల్లో గ్రా సచివాలయాలు, ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వాటిలో 450 ఖాళీ చేయించాం. మిగతావాటిని త్వరలో ఖాళీ చేయిస్తాం’’ అని తెలిపారు. దీంతో అధికారులు తీసుకున్న చర్యలపై అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
0 Response to "How did the schools open?"
Post a Comment