Noise when school!
బడి వేళ అలజడి!
- పిల్లల్లో పెరుగుతున్న కేసులు
- గుంటూరు కొవిడ్ సెంటర్ ఐసొలేషన్లో 18 మంది
- 16 నుంచి పాఠశాలలు
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ఈ నెల 16 నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంస్థలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇన్నాళ్లూ విద్యార్థులకు విద్యాలయాలకు దూరం చేసిన కరోనా మహమ్మారి మరోసారి అలజడి రేపుతోంది. పాఠశాలలు తెరుచుకోనున్న తరుణంలో చిన్నారుల్లో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోనూ 200 మంది వరకు పిల్లలకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. తాజాగా గుంటూరు నగరంలోని అడవి తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ప్రస్తుతం 18 మంది చిన్నారులు ఐసొలేషన్లో ఉన్నట్టు సమాచారం. గతంలో చిన్న పిల్లలకు వైరస్ సోకినా లక్షణాలు పెద్దగా కనిపించేవి కావు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒళ్లునొప్పులు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు మూడు, నాలుగు రోజులపాటు ఉంటున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్గా తేలిన పిల్లలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇలా అడవి తక్కెళ్లపాడులోని కొవిడ్ కేర్ సెంటర్కు చిన్నారుల కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేదని భావిస్తున్న తరుణంలో గుంటూరులోని కొవిడ్ కేర్ సెంటర్లోనే ఇంత మంది పిల్లలు చికిత్స పొందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ విభాగాలను ప్రత్యేకంగా సిద్ధం చేస్తుండడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కాగా గుంటూరు నగరంలోనూ కొవిడ్ బారినపడిన పిల్లల సమాచారం వెలుగుచూస్తోంది. కొవిడ్ కేర్ సెంటర్లకు రాకుండా కొంతమంది ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 16 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
0 Response to "Noise when school!"
Post a Comment