The lifestyle of children changed during Kovid
బద్దకం వీడేలా..గాడిలో పడేలా..!
కొవిడ్ సమయంలో మారిన చిన్నారుల జీవనశైలి
16 నుంచి బడులు..
ఇప్పటి నుంచే సిద్ధం చేస్తే మేలు
అప్పుడు..బడి ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్రలేవడం.. అల్పాహారం తినకుండా హడావుడిగా పాఠశాలలకు వెళ్లడం.. తిరిగి సాయంత్రం రావడం.. కాసేపు విశ్రాంతి.. అనంతరం మళ్లీ హోంవర్కులు.. అన్ని అయ్యాక త్వరగా నిద్రపోయేవారు. ఇలా ఉండేది చిన్నారుల దినచర్య.
ఇప్పుడు.. కొవిడ్ దెబ్బకు వారి దినచర్య పూర్తిగా గాడితప్పింది. రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. దాంతో పిల్లల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల్లో చురుకుదనం తగ్గిపోయి.. పొద్దస్తమానం టీవీ, స్మార్ట్ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. కరోనా సద్దుమణిగిన తర్వాత ప్రభుత్వం గత విద్యా సంవత్సరం మొదటిగా పది, తొమ్మిది విద్యార్థులపై దృష్టిసారించింది. వారిని మాత్రమే బడులకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. క్రమేణా మిగతా తరగతుల విద్యార్థులక తరగతులు ప్రారంభించారు. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ బడులు మూసివేశారు. పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. సెల్ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేస్తున్న వారిని ఎలా గాడిలో పెట్టాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తమ పిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలని పలువురు నెల్లూరు నగరంలోని మానసిక వైద్య నిపుణుల వద్దకు వస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 2021- 22 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. చిన్నారుల్లో ముందున్నట్లుగా ఉత్తేజం నింపేందుకు, వారిలో బద్దకం పోగొట్టి బడి బాట పట్టించేందుకు తల్లిదండ్రులు ఇప్పటి నుంచే కసరత్తు ఆరంభించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మంచి నిద్ర అవసరం
ప్రస్తుతం పాఠశాలలు లేకపోవడంతో ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు చాలా మంది విద్యార్థుల్లో పోయింది. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం బద్దకంగా లేవడం.. సమయానికి ఏ పని చేయకపోవడం, ఇలాంటివి ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. అందుకే మళ్లీ పాఠశాలలకు వెళ్లేందుకు వీలుగా వారిని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. చాలా మంది పిల్లలు రాత్రి 12 గంటల వరకు నిద్రమేల్కొనే ఉంటున్నారు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే 5 నుంచి 6 గంటల్లోపు నిద్ర లేపాలి. అప్పుడే కచ్చితంగా రాత్రి త్వరగా పడుకుంటారు. పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడానికి ఆకుకూరలు, తాజా పండ్లు రోజూ ఆహారంలో అందించాలి.
పుస్తక పఠనం..
గదిలో ఉపాధ్యాయులు బోధించేటప్పుడు ఉన్నంత ఆసక్తి, శ్రద్ధ ఆన్లైన్ విద్యపై చిన్నారులు కనబర్చడం లేదు. అందుకే ప్రస్తుతం పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. కథలు, ఆసక్తికర అంశాలకు సంబంధించిన పుస్తకాలను చిన్నారులకు ఇచ్ఛి. వాటిని చదివించాలి. వాటిలో ఉండే విషయాలను అడిగి తెలుసుకోవాలి. అప్పుడే వారిలో మళ్లీ పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది.
పాఠశాల రోజులు..
పాఠశాలకు రెండేళ్లుగా విద్యార్థులు వెళ్లడం లేదు. అందుకే మళ్లీ పాఠశాలకు ఒక్కసారిగా వెళ్లాలంటే విద్యార్థులకు ఆసక్తి ఉండదు. ఒకవేళ వెళ్లినా ఏకాగ్రత కుదరదు. అందుకే వారికి పాఠశాలకు వెళితే కలిగే ఆనందం గుర్తు చేయాలి. వారిలో ఉత్సాహం నింపాలి. స్నేహితులతో ఆటలు, పాఠశాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఆసక్తి రేకెత్తించాలి.
ఏకాగ్రత పెరిగేలా...
చిన్నారుల్లో ఏకాగ్రత పెంచేందుకు అవసరమైన ఆటలు ఎంపిక చేయాలి. వారిలో చైతన్యం నింపేందుకు పజిల్స్, చెస్, క్యారమ్స్, తదితర ఆటలు ఆడించాలి. తల్లిదండ్రులు కూడా ఆడితే చిన్నారుల్లో మరింత ఉత్సాహం వస్తుంది. క్విజ్ పోటీలు పెట్టాలి. వారిని ప్రోత్సహించేందుకు బహుమతులు ఇవ్వాలి. సాయంత్రం వేళల్లో ఇంటి దగ్గర ఓ గంట సమయం ఆడుకోనివ్వాలి.
ధ్యానం.. యోగా
కొవిడ్ సమయంలో అందరూ శ్వాసక్రియను మెరుగుపరిచే యోగా, ధ్యానం సాధన చేస్తున్నారు. చిన్నారులతోనూ వీటిని నిత్యం చేయించాలి. ఏకాగ్రత పెంచేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఉదయాన్నే ఓ అరగంట ధ్యానం చేయించాలి. వీలైతే. రోజూ కొద్దిసేపు వారిని నడకకు తీసుకెళ్లాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఆ బాధ్యత తల్లిదండ్రులదే.
శ్రీనివాసతేజ, మానసిక వ్యాధి నిపుణుడు
మా పిల్లాడిలో గతంలో ఉన్నంత ఉత్సాహం లేదంటూ ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు మాకు చెబుతున్నారు. ఏ మాట చెప్పినా వినడం లేదని, పొద్దస్తమానం సెల్ఫోన్.. లేదంటే టీవీతోనే గడుపుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. గతంలోనూ కొంత మంది చిన్నారులు ఇలా చేసేవారు. కానీ కొవిడ్ కారణంగా బడులు పూర్తిగా లేకపోవడంతో ఇప్పుడు మరింత ఎక్కువైంది. చదువైనా, ఇంకే పనైనా.. మధ్యలో కొంత గ్యాప్ వస్తే.. మళ్లీ ఆరంభించడం కష్టమవుతుంది. అందుకే విద్యార్థుల్లో గతంలో ఉన్నంత ఉత్తేజం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.
0 Response to "The lifestyle of children changed during Kovid"
Post a Comment