The process of merging 3rd, 4th, and 5th grades in high schools has become confusing.
విలీనం.. గరదరగోళం!
పిల్లలను పంపారు సరే.. ఉపాధ్యాయుల మాటేమిటీ
ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ గందరగోళంగా తయారైంది. జిల్లా విద్యాశాఖకు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల విలీనం సరే, అసలు ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన ఉపాధ్యాయులు ఎవరనేది ఇప్పటి దాకా గుర్తించలేదు. దీంతో విలీన ప్రక్రియ అసంపూర్తిగా మారింది. తొలుత ఉపాధ్యాయుల్లో సీనియర్లను గుర్తించి విలీన ప్రక్రియ చేపడితే ఎవరికీ సమస్యలు ఉండేవి కాదు. టీచర్లను పంపకుండా పిల్లలను విలీనం చేస్తే ఏం ప్రయోజనం? అక్కడ వారికి ఎవరు బోధన చేస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది.
కొందరు టీటీసీ, మరికొందరు డీఎడ్ చేసి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియామకమయ్యారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేసి వారికి విద్యార్హతలు కలిగిన సీనియర్ టీచర్లతోనే బోధన చేయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమలుకు వచ్చేసరికి ఆ నిబంధన మరుగునపడిపోయింది. ప్రస్తుతం చాలామంది సీనియర్లు తమకన్నా జూనియర్లుగా ఉన్న ఉపాధ్యాయుల్లో బీఈడీ వంటి అదనపు అర్హతలు ఉంటే ఉన్నత పాఠశాలలకు పంపాలని, తాము ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంటామని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం విలీన పాఠశాలకు ఎవరిని పంపాలో తెలియక ఎంఈవోలు సతమతమవుతున్నారు. ఇప్పటికే వెళ్లిన పిల్లలకు కొత్త పాఠశాలల్లో బోధన చేయటానికి సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోందని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలకు 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల పిల్లలను విలీనం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లాలో 249 పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే పిల్లలను చేర్చుకోవడంపై పురపాలకశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో మున్సిపల్ పాఠశాలల హెచ్ఎంలు పిల్లలను చేర్చుకోవడం లేదు. ఇలా గందరగోళం నడుమ తరగతుల విలీనం జిల్లాలో జరుగుతోంది. ఇప్పటికే పిల్లలను మాత్రం విలీనం చేసినట్లు కాగితాలపై చూపారు. కొన్నిచోట్ల నూతన పాఠశాలల్లోకి వెళ్లి కూర్చుంటున్నారు.
‘టీచర్లను సర్దుబాటు చేయకుండా పిల్లలను పంపారు? వారికి ఎవరు బోధన చేయాలి? ఎవరు హాజరు వేయాలి? మధ్యాహ్న భోజనం ఎలా సమకూర్చాలి వంటివి సమస్యలుగా ఉన్నాయని సీనియర్ ప్రధానోపాధ్యాయుడొకరు తెలిపారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రుల్లోనూ ఇదే విషయమై ఆందోళన నెలకొంది.
30 మంది దాటితే ఇద్దరు టీచర్లు
ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులతో పోలిస్తే 1, 2 తరగతుల్లోనే పిల్లలు ఎక్కువ ఉంటారు. 1, 2 తరగతుల్లో కలిపి 30 మందికి పైగా విద్యార్థులు ఉంటే అక్కడ విధిగా ఇద్దరు టీచర్లు ఉండాలి. ఇదే పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులకు ఆ ఇద్దరిలో ఒకరిని పంపితే మిగిలిన 30 మందికి ఒక్క టీచర్ ఎలా బోధిస్తారు? అనారోగ్యమో ఇంకేదైనా కారణంతో ఆ ఒక్కరు సెలవు పెడితే ఆ రోజు పాఠశాలను ఎవరు తెరుస్తారనేది తెలియకుండా ఉంది. ఇప్పటికైనా ఈ గరదరగోళానికి తెరదించేందుకు డీఈఓ, ఆర్జేడీ వంటి ఉన్నతాధికారులు ఈ కసరత్తుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి
పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అప్గ్రేడ్ పాఠశాలకు 176 మంది పిల్లలు వచ్చారు. కానీ టీచర్లు ముగ్గురే వచ్చారు. వాస్తవానికి ఆరుగురు ఉపాధ్యాయులు రావాలి. V దుర్గి మండలం ముతుకూరు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడి కన్నా జూనియర్కు విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవర్ని విలీన పాఠశాలకు పంపాలనేది ఇప్పటికీ ఖరారు చేయలేదు.
మేడికొండూరు మండలం తురకపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎవరు సీనియర్, జూనియరో తేలక కుస్తీలు పడుతున్నారు. ఇక్కడ ఒక టీచర్ అంతర జిల్లా బదిలీపై ఇక్కడకు వచ్చారని, ఆయన సీనియారిటీని ఎలా లెక్కించాలనేది వారికి అంతుచిక్కడం లేదు. బెల్లంకొండలో పిల్లలను విలీనం చేసి ఉపాధ్యాయులను పంపలేదు.
0 Response to "The process of merging 3rd, 4th, and 5th grades in high schools has become confusing."
Post a Comment