Highlights of Union Budget -2022
Highlights of Union Budget -2022
వేతన జీవులకు ఊరట కల్పించే ఏ నిర్ణయాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రకటించలేదు. దీంతో ఈసారి కూడా ఆదాయపన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సగటు ఉద్యోగికి నిరాశే మిగిలింది.
ముగిసిన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం
2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు సమర్పించారు. ఆర్థిక బిల్లు -2022ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ NPS డిడక్షన్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) డిడక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను
క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఆర్బీఐ ద్వారా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ తీసుకొస్తామన్నారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగానే డిజిటల్ కరెన్సీల రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం వస్తుందన్నారు మంత్రి.
ఐటీ రిటర్న్ల దాఖలులో మరో వెసులుబాటు
ఐటీ రిటర్న్ల దాఖలులో మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్డేట్ చేసుకునే వెసులుబాటు అందించారు. అంటే రిటర్న్లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. అదే విధంగా కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం విస్తరించనున్నట్లు ప్రకటించారు. సహకార సంఘాలపై సర్ఛార్జీని తగ్గించనున్నారు.
2022-23 బడ్జెట్లో ద్రవ్యలోటు 6.9 శాతం
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022-23 బడ్జెట్లో ద్రవ్యలోటు 6.9 శాతమని, దాన్ని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
డిజిటల్ కరెన్సీ రాకతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి
డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. ‘‘యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు.
దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణకు సంబంధించి దేశీయంగా తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘రక్షణ రంగ ఉత్పత్తులను రూపొందించేందుకు ప్రైవేటుకు ప్రోత్సాహమిస్తాం. వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొనేందుకు పథకం తీసుకొస్తాం. పంటల మదింపు, భూరికార్డుల డిజిటిలీకరణ, పురుగు మందుల వినియోగంలో డ్రోన్ల సహకారం’’ తీసుకొస్తామన్నారు. సాగు రంగంలో యాంత్రికీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తాం. వరి- గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. గంగా పరివాహం వెంబడి నేచురల్ ఫార్మింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. మహిళలు, చిన్నారుల అభివృద్ధికి మూడు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నాం అని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
త్వరలో ఈ-పాస్పోర్ట్ విధానం
త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్పోర్ట్ విధానం తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం తీసుకొస్తాం. దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తాం. విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తాం. 2022-23లో 5జీ సర్వీసులు తీసుకొస్తాం. భూ సంస్కరణల్లో భాగంగా ఒక దేశం.. ఒక రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెడతాం అని ఆర్థిక మంత్రి తెలిపారు.
వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్లో మార్పులు
వ్యవసాయ వర్సిటీల్లో ఇప్పటివరకూ ఉన్న సిలబస్లో మార్పులు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. ‘‘పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్లోకి తీసుకొస్తాం. దేశం నలుమూలలకు డిజిటల్ బ్యాంకింగ్ విస్తరించేలా చేస్తాం. 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం’’ అని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. అలాగే కాలం చెల్లిన చట్టాల రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500కోట్లు కేటాయిస్తున్నామన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్లు
ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్ఫాం ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్లకు ఆర్థికసాయం ఇస్తామన్నారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు ఇస్తాం. 2 లక్షల అంగన్వాడీలను ఆధునీకరిస్తాం. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా 80 లక్షల గృహాల నిర్మాణం చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్
- మొదటి సూత్రం-ప్రధాని గతిశక్తియోజన
- రెండో సూత్రం- సమీకృత అభివృద్ధి
- మూడో సూత్రం- అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
- నాలుగో సూత్రం- పరిశ్రమలకు ఆర్థిక ఊతం
- ఈ నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
నారీ శక్తికి ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
మహిళా, శిశు సంక్షేమ శాఖను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్ పథకాలు, ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంట్ పథకం. తీసుకొస్తాం. దీని కోసం రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఇస్తాం’’ అని మంత్రి తెలిపారు.
డిజిటల్ యూనివర్సిటీ స్థాపన
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ‘‘పీఎం విద్యలో భాగంగా టీవీ ఛానళ్ల సంఖ్యను 12 నుంచి 200కి పెంచుతున్నాం. ఈ-కంటెంట్లో నాణ్యత పెంచుతాం. డిజిటల్ యూనివర్సిటీ స్థాపిస్తాం’’ అని మంత్రి చెప్పారు.
ఆ 7 రంగాలపై దృష్టి...
తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు అంశాలపై దృష్టిసారిస్తాం అని మంత్రి తెలిపారు.
చిరుధాన్యాల సంవత్సరంగా 2023
2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తాం’’ అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు.
400 వందే భారత్ రైళ్లు: నిర్మలా సీతారామన్
రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి సాధించాం. మేకిన్ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు.400 వందే భారత్ రైళ్లు. 100 గతిశక్తి టెర్మినల్స్. జాతీయ రహదారులు మరో 25 వేల కి.మీ. విస్తరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది
పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే 25 ఏళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తోంది. నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటుపరం చేశాం. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తాం’’ అని తెలిపార
ఆర్థికంగా కోలుకున్నాం...
మౌలిక సౌకర్యాలు.. టీకాలు.. ఆర్థిక రంగ విస్తరణలో కీలక పాత్ర పోషించాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం బదలాయించింది. త్వరలోనే ఎల్ఐసీ ఐపీవోను తీసుకొస్తాం. 2021-22లో ఆర్థికంగా కోలుకున్నాం. ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది
వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. బడ్జెట్ 2022-23ను లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంతో టీకా కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.
బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ను ఆమె సమర్పించారు.
Union Budget 2022: బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. కరోనా మూడో ఉద్ధృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనందుకు ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక వేతనజీవులకు కొంతమేర ఉపశమనం లభించొచ్చని తెలుస్తోంది. అంతకుముందు నిర్మలమ్మ బృందం పద్దుల ట్యాబ్తో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ను వివరించారు.
0 Response to "Highlights of Union Budget -2022"
Post a Comment