Psychological problems in students
విద్యార్థుల్లో మానసిక సమస్యలు
రెండేళ్ల విరామం తర్వాత పబ్లిక్ పరీక్షలు
విజయవాడ మధురానగర్కు చెందిన మహేష్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పది చదువుతున్నాడు. గతంలో బాగా మొబైల్ ఫోన్లలో ఆటలాడటం, సినిమాలు చూడటం వంటివి చేసేవాడు. పరీక్షలు దగ్గర పడడంతో గత నెల రోజుల నుంచి తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని కట్టడి చేశారు. దాన్ని తట్టుకోలేక ఫోన్ ఇవ్వకపోతే చనిపోతానని తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేయడం, హఠాత్తుగా నిద్ర లేచి ఫోన్ కోసం వెతుక్కోవటం వంటివి చేయటాన్ని గుర్తించి తల్లిదండ్రులు జీజీహెచ్కు తీసుకొచ్చారు.
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీవిద్య ఓ కార్పొరేట్ స్కూల్లో పది చదువుతోంది. పరీక్షల్లో మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఆ బాలిక బాగా చదువుతోందని తొలుత ఎఫ్-1 సెక్షన్కు ప్రమోట్ చేశారు. ఆ సెక్షన్లోని సహచర పిల్లలతో పరిచయాలు పెంచుకుని నిత్యం హుషారుగా స్కూల్కు వెళుతోంది. తీరా 20 రోజుల క్రితం మళ్లీ సెక్షన్లు మార్చారు. ఈసారి ఆ బాలికను అంతగా చదవడం లేదని ఎఫ్-3 సెక్షన్కు డిమోట్ చేశారు. దీంతో దాన్ని అవమానంగా(ఇన్సల్ట్) భావించి సదరు విద్యార్థిని అన్నం తినకపోవడం, సరిగా నిద్రపోకపోవడం వంటివి చేస్తోందని గుర్తించి తల్లిదండ్రులు జీజీహెచ్లోని మానసిక విభాగం వైద్యుల వద్దకు తీసుకొచ్చారు.
ఇలాంటి ఉదంతాలు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలోని మానసిక వ్యాధుల విభాగంతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోని సైక్రియాటిస్టుల వద్దకు ఎక్కువగా వస్తున్నాయి. పలువురు పది, ఇంటర్ విద్యార్థులు మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలతో పాటు జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఈసారి అన్నీ ఒకేసారి జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
వరుసగా రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు జరగడం లేదు. చాలా మంది విద్యార్థుల్లో పరీక్షలంటే సీరియస్ నెస్ తగ్గిపోయింది. ఈ ఏడాదీ పరీక్షలు ఉండకపోవచ్చని భావించారు. దీంతో ఆన్లైన్ క్లాసులను నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డులు చర్యలు తీసుకోవడంతో ఇప్పటి వరకు ప్రణాళికా బద్ధంగా చదవని వారు ఆ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. మరోవైపు కొందరు తల్లిదండ్రులు మంచి మార్కులు సాధించాలని ఒత్తిడి పెంచడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అధిగమించాలిలా.
గతంలో పది, ఇంటర్, జేఈఈ పరీక్షలు రాసిన సీనియర్ విద్యార్థుల నుంచి వారు ఎలా సన్నద్ధమయ్యారో తెలుసుకుని అందుకు తగ్గ టైం టేబుల్ రూపొందించుకుని ఆచరించాలి.
చదవలేకపోతున్నా.. ఇంకేమైన ఆందోళనతో బాధపడుతుంటే వెంటనే తల్లిదండ్రులతో పంచుకోవాలి.
చదవకపోతే టీచర్లు దండిస్తారని, మార్కులు తగ్గితే తల్లిదండ్రులు కోపపడతారని భావించి వారికి దూరంగా ఉండకూడదు. వారిని కలిస్తే ఆ సమయంలో వారిచ్చే సూచనలు ఉపకరిస్తాయి.
ప్రతి న్యితం మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం చేయించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
విద్యార్థి ఒత్తిడికి గురవుతున్నాడని భావిస్తే తల్లిదండ్రులు అతనితో సరాదాగా గడపాలి. ఆ సమయంలో పుస్తకాలు పక్కన పెట్టేయించాలి.
పరీక్షలు ముగిసే వరకు టీవీలు, ఫోన్ల వాడకానికి స్వస్తి పలకాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు నచ్చజెప్పాలి. ఏది చేసినా పిల్లల సమ్మతితో చేస్తే మానసికంగా వారు అందుకు సంసిద్ధమవుతారు.
తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. కచ్చితంగా 7-8 గంటల సేపు నిద్రపోవాలి.
కేసులు బాగా పెరిగాయి
ఆచార్య ఉమాజ్యోతి, విభాగాధిపతి, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్
గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం జీజీహెచ్కు టెన్త్, ఇంటర్ చదివే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది విద్యార్థులు వస్తున్నారు. వారితో మాట్లాడితే దడ, వణుకు వస్తుందని, చాతీలో నొప్పి ఉంటోందని, నోరు ఎండిపోతోందని, పరీక్షలు రాయలేమని, ఏం చదివినా గుర్తుండటం లేదని, నిద్రపట్టడం లేదని, కళాశాలకు వెళ్లబుద్దికావడం లేదని, చదవకపోతే టీచర్లు ఊరుకోరని, మార్కులు తక్కువొస్తే తల్లిదండ్రులు కోపడతారని, సహచర విద్యార్థులు ఏడిపిస్తారని.. ఇలా అనేక కారణాలు చెబుతున్నారు.ఆస్పత్రులకు వస్తున్నవారివి ఒక్కొక్కరివి ఒక్కో రకమైన సమస్యలు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వాటిని అధిగమించటానికి కూర్చొబెట్టి కౌన్సెలింగ్ చేస్తున్నాం.
0 Response to "Psychological problems in students"
Post a Comment