About aided Schools
418 ఎయిడెడ్ స్కూళ్లపై వేటు
- మూసేసే దిశగా చర్యలకు ఆదేశాలు
- ఒక్కోదానిలో 35 మందిలోపు పిల్లలు
- సంఖ్య పెంచుకోలేదనే కఠిన చర్యలు
- ఇక్కడివారు సమీప స్కూల్కు వెళ్లాల్సిన పరిస్థితి
దశాబ్దాల నుంచి లక్షల మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన వందల ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఇక మూతపడనున్నాయి. రాష్ట్రంలో 418 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలపై వేటు వేయనున్నారు. ఈ పాఠశాలలన్నింటినీ మూసేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఒక్కోదానిలో 8 నుంచి 35 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ సంఖ్య సరిపోదని.. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని గత ఏడాది కొన్ని పాఠశాలలకు నోటీసులిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచుకుంటేనే పాఠశాలలు నడిచేందుకు అనుమతి ఉంటుందని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలను పెంచుకోగా వాటిని మినహాయించి.. 418 పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ రెండురోజుల క్రితం పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. గత మూడు విద్యాసంవత్సరాల నుంచీ ఈ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి.
కొన్ని పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో చట్టప్రకారం వీటిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రాంతీయ సంయుక్త డైరక్టర్లకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. దీని ప్రకారం.. ఆయా పాఠశాలలను దాదాపుగా మూసేసే దిశగా, లేకుంటే అనుమతి రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. వాస్తవానికి ఈ పాఠశాలలు స్వాతంత్య్రం వచ్చినకాలం నుంచీ నడుస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎయిడెడ్ పాఠశాలలు మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జీవోలు జారీ చేసింది. విమర్శలు రావడంతో ఇష్టమైన ఎయిడెడ్ పాఠశాలలనే విలీనం చేసుకుంటామని.. ఇష్టంలేనివి ఇక ప్రైవేటు పాఠశాలలుగా కొన సాగవచ్చని జీవోలను సరిచేస్తూ మళ్లీ ఉత్తర్వులిచ్చింది. కొన్ని పాఠశాలలు ప్రభుత్వంలో విలీనమయ్యాయి. కొన్ని పాఠశాలలు ప్రైవేటుగానే కొనసాగుతామని పేర్కొన్నాయి. ఈ కసరత్తుతో ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు సాయం చేయకుండా తప్పించుకుందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలుగా ఉన్న ఈ వందలాది స్కూళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసింది.
క్రిస్టియన్ సంస్థలవే ఎక్కువ:
మూసి వేత, లేదా అనుమతుల రద్దు వంటి చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఉత్తర్వులతో పాటు.. ఏయే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలనే జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం క్రిస్టియన్ సంస్థలవే ఎక్కువగా ఉన్నాయి. క్రైస్తవ చారిటీ సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. సీఎ్సఐ ఎయిడెడ్ పాఠశాలలు, బెట్టిమెమొరీ, లూథర్న్ పీఎస్, సీబీఎం, ఆర్సీఎం, ఆర్సీఎంపీఎస్, ఏబీసీఎం, హేస్, ఆర్సీఎం ఎలే, సీఎ్సఐ పీఎస్ ఇలాంటి క్రైస్తవ చారిటీ సంస్థలు నడిపిస్తున్న పాఠశాలలు అధికంగా ఉన్నాయి. ఇవేకాకుండా కొన్ని హిందూ సంస్థలవి కూడా ఉన్నాయి. హిందూ ఎయిడెడ్, విశ్వోదయ పేరుతో కొన్ని పాఠశాలలున్నాయి. మొత్తంగా ఈ పాఠశాలలన్నింటిలో ఎక్కువగా ఏకోపాధ్యాయ స్కూళ్లే ఉన్నాయి. వీటిపై ఒకేసారి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు.
చిన్నారులకు ఇబ్బందే!
ఒకవేళ ఈ పాఠశాలలకు ఇచ్చిన అనుమతులను రద్దుచేస్తే.. అక్కడ ఉన్న పిల్లల్ని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాఠశాలల్లో చదివేవారు పేదల పిల్లలే. ఇక్కడ ఉచితంగానే విద్య అందిస్తుండడం, పైగా ఇళ్లకు దగ్గరగా ఉండడంతోనే ఇక్కడ చదివిస్తున్నారు. అసలు అడ్మిషన్లు లేని పాఠశాలలపై చర్యలు తీసుకున్నా ఫర్వాలేదని.. కానీ, 25-30 మందిపైన విద్యార్థులున్న పాఠశాలలపైనా చర్యలు తీసుకోవాలనడం సరికాదని తల్లిదండ్రులు అంటున్నారు. అలాంటి పాఠశాలలు గతం నుంచీ అనేకమందికి విద్యనందించి ఉంటాయని, వాటికి కొనసాగేందుకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి.. ఇలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గర్హనీయమని చెబుతున్నారు.
0 Response to "About aided Schools"
Post a Comment