Millennium March with 4 lakh people
4 లక్షల మందితో మిలీనియం మార్చ్
సెప్టెంబరు 1న నిర్వహణకు ఉద్యోగుల నిర్ణయం
ఉద్యోగ సంఘాలన్నీ కలిసే CPS పై పోరాటం
జీపీఎస్ వ్యూహం పెద్ద మోసమని, ఇది దగాకోరు ప్రభుత్వమని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్ను వ్యతిరేకిస్తూ అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో సెప్టెంబరు 1న నాలుగు లక్షల మందితో మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. విజయవాడలోని ధర్నాచౌక్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ‘ఓపీఎస్ సంకల్ప దీక్ష’ చేపట్టారు. ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్, ఏపీఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో సీపీఎస్ను రద్దు చేయడం సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భూపేష్, అశోక్ గెహ్లోత్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహాన్ని నిలదీసేందుకు శ్రీకాకుళంలో జులై 24న ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఉద్యోగ సంఘాలన్నీ కలిసే సీపీఎస్పై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రెండు ప్రధాన సంఘాల నేతలు వెల్లడించారు.
ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ*.. ‘సీపీఎస్ను రద్దు చేస్తామని జగన్ ఇచ్చిన హామీని నమ్మే.. వైకాపాను ఘనంగా గెలిపించాం. కానీ.. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాలాభిషేకం చేసే పరిస్థితిని తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు. ఏపీసీపీఎస్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను చూసైనా జగన్ మారాలని, సీపీఎస్ విధానంవల్ల రాష్ట్రంలో ఒక్క విశ్రాంత సీపీఎస్ ఉద్యోగికైనా రూ.15వేల పెన్షన్ వచ్చినట్లు చూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు.
ఏపీఎన్జీఓ నాయకుడు విద్యాసాగర్ మాట్లాడుతూ..* రాష్ట్రంలో ఉద్యోగులందరూ దిక్కులేని అభాగ్యుల్లా మారారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఏపీసీపీఎస్ఈఏ బ్యానర్ పట్టుకుని నడిచిన రోజులు గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీక్షలో కృష్ణా జిల్లా ఏపీసీఎస్ఈఏ అధ్యక్ష, కార్యదర్శులు రాంప్రసాద్, నర్సింహారావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శి మురళీ, ఉపాధ్యక్షుడు రాంబాబు, నేతలు ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Response to "Millennium March with 4 lakh people"
Post a Comment