APSRTC Lot Women Drivers .. Sensational Decision of AP Govt.; Women get ready!
APSRTC లాట్ మహిళా డ్రైవర్లు .. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం ; మహిళలు గెట్ రెడీ !
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించాలని నిర్ణయించింది.
అందుకోసం చర్యలు మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కసరత్తు మొదలు పెట్టారు.
ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ.. ఆపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ లుగా పోస్టింగ్
రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికను తయారు చేశారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులని ఇప్పటికే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం తొలి దశలో 310 ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మహిళలకు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయడంలో శిక్షణ ఇచ్చి ప్రస్తుతం ఉన్న ఖాళీలలో ఆర్టీసీ బస్సులకు డ్రైవర్లుగా నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే .
త్వరలో మార్గదర్శకాలు విడుదల.. ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ లలో 32 రోజుల పాటు శిక్షణ
సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేయడానికి త్వరలో మార్గదర్శకాలను సైతం విడుదల చేయనున్నారు. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాలలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులని ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసి వారికి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ లలో 32 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సులపైనే వారికి శిక్షణ ఇవ్వడంతో డ్రైవింగ్ లో వారికి మరింత మెళకువలు తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
తొలిదశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులలో నియామకాలు
శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మహిళా అభ్యర్థులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం తో పాటు, ఆర్టీసీలోనే డ్రైవర్ గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలిదశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులలో నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులలో మహిళలకు స్థానం దక్కనుంది .
ఏపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట.. ఆర్టీసీలో డ్రైవర్ లుగా కొత్త ప్రయోగం
ఏది ఏమైనా క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పించటం మాత్రమే కాకుండా, నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఇక మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని మరోమారు తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది. మహిళల శక్తి సామర్ధ్యాలను నమ్మి ఆర్టీసీలో డ్రైవర్ లుగా కొత్త ప్రయోగం చెయ్యనుంది. మరి ఈ అవకాశాన్ని మహిళలు ఎంతమేరకు అందిపుచ్చుకుంటారో తెలియాల్సి ఉంది.
0 Response to "APSRTC Lot Women Drivers .. Sensational Decision of AP Govt.; Women get ready!"
Post a Comment