Check for government teachers?
సర్కారీ టీచర్లకు చెక్?
- ప్రైవేటు వ్యక్తులకు ఆహ్వానం
- టీచ్ ద చైల్డ్’ పేరుతో పిలుప
- రాయచోటిలో కొత్త విధానం
- ఇప్పటికే రేషనలైజేషన్తో టీచర్ పోస్టుల మిగులు
- డీఎస్సీ లేకుండా చేసే యత్నం
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో టీచర్లపై పనిభారం పెంచి, ఉన్నవారినే మిగులుగా చూపిస్తున్న ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు వ్యక్తులను బోధనకు ఆహ్వానించింది. ఈ మేరకు రాయచోటి జిల్లా డీఈవో కొత్త విధానానికి తెరతీశారు. ‘టీచ్ ద చైల్డ్’ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు ఆహ్వానం పలికారు. వీరితోపాటు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అర్హత కలిగిన సేవకులు కూడా రావొచ్చని తెలిపారు. ఆర్థిక లబ్ధి ఆశించని వారు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగినవారు వారి వివరాలను నమోదుచేయాలని వెబ్సైట్ను కూడా సూచించారు. ఈ ఆదేశాలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. ఇదే విధానం అన్ని జిల్లాల్లో అమలుచేస్తే ప్రభుత్వ టీచర్ల పాత్ర పరిమితం అవుతుందన్న ఆందోళన మొదలైంది. గతంలో విద్యా వలంటీర్లు, అకడెమిక్ ఇన్స్ట్రక్టర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. నాలుగేళ్ల నుంచి ఈ విధానం పూర్తిగా కనుమరుగైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిపడ సంఖ్యలో ఉన్నందున వారితో అవసరం లేదనే ఆలోచనతో అలాంటి విధానం రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఇది క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు అవసరమేంటి?
ఇప్పటికే పాఠశాల విద్యాశాఖను వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. జాతీయ విద్యా విధానం అమలును సాకుగా చూపుతూ పాఠశాలలను ఇష్టానుసారం విభజించింది. అందుకు అనుగుణంగా పాఠశాలల్లోని తరగతుల విలీనం చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని భారీగా పెంచింది. ప్రధానోపాధ్యాయుల సంఖ్యను కుదించింది. దీంతో భారీగా ఉపాధ్యాయులను మిగులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారని లెక్క తేల్చే ఆలోచనలో ఉంది. దీంతో ఉపాధ్యాయులు మిగిలిపోయారని, ఇక, కొత్తగా ఉపాధ్యాయుల అవసరం లేదనే భావనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల అవసరం ఏమొచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది.
డీఎస్సీకి మంగళం
ప్రతిపక్షంలో ఉండగా 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎందుకు భర్తీ చేయడం లేదని వైసీపీ ప్రశ్నించింది. తీరా అధికారంలోకి వచ్చాక డీఎస్సీ గురించి పూర్తిగా మర్చిపోయింది. పైగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి రాకుండా రేషనలైజేషన్ చేపట్టి ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారని చూపిస్తోంది. ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉంటే ఇప్పుడు రేషనలైజేషన్లో మిగిలిపోతున్న వారిని సర్దుబాటు చేస్తోంది. దీంతో ఎంత మంది మిగిలిపోతారోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఖాళీలను భర్తీచేయడం ఎత్తివేసి, ఆ పోస్టులు రద్దు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులను బోధనలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటంతో ఇక డీఎస్సీ ఉండదనే వాదనకు బలం చేకూరుతోంది.
ఉపాధ్యాయులపై కక్ష సాధింపు
ప్రభుత్వ చర్యలు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ అంశంపై విజయవాడలో ధర్నా జరిగినప్పటినుంచీ తమపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అంటున్నారు. దీనిలో భాగంగానే రేషనలైజేషన్ అంటూ పాఠశాల విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని, తద్వారా ఉపాధ్యాయుల ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యల కొనసాగింపుగానే తాజా ఉత్తర్వులు వెలువడి ఉండొచ్చని అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
0 Response to "Check for government teachers?"
Post a Comment