CM's review on the construction progress of Jagananna colonies
జగనన్న కాలనీల నిర్మాణ పురోగతిపై సీఎం సమీక్ష
జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయని, ఇలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గృహనిర్మాణశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ… గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా అవసరమైన చోట భూమి చదును, పూడ్చడం, అంతర్గత రోడ్లు, గోదాముల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఆప్షన్-3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఆప్షన్ -3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశిత ఎస్ఓపీని పాటించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా?లేదా? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? ఇవన్నీ కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే గోదాములు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలని, ముఖ్యంగా కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్లైట్లు వంటి పరికరాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టంచేశారు. నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలని, 90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. ఈసమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 Response to "CM's review on the construction progress of Jagananna colonies"
Post a Comment