School only when the teacher comes!
టీచర్ వస్తేనే బడి!
- వారు సెలవు పెడితే ఆ రోజుకు మూతే
- ఇప్పటికే 7వేల వరకూ ఏకోపాధ్యాయ బడులు
- ఇకపై వీటి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం
రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ పతానవస్థకు చేరుతోంది. ఇప్పటికే దయనీయంగా మారిన ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఇకపై మరింత దిగజారనుంది. ప్రస్తుతం ఏపీలో దాదాపు 7వేల వరకూ ఏకోపాధ్యాయ బడులు ఉంటే వాటి సంఖ్య ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్తగా తీసుకొచ్చిన ఫౌండేషన్ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ మాత్రమే ఉంటారని వైసీపీ సర్కారు తాజాగా స్పష్టం చేసింది. 21వ విద్యార్థి ఉంటేనే రెండో ఎస్జీటీ ఉంటారని, అయితే 60 మంది వరకూ ఇద్దరు ఉపాధ్యాయులేనని పేర్కొంది. ఈ మేరకు గతంలో ఇచ్చిన జీవో 117కు బుధవారం అర్ధరాత్రి సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు అంశాల్లో హామీలు ఇవ్వగా కేవలం ఒకట్రెండు అంశాలనే సవరిస్తూ ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జీవో 117 ప్రకారం 30 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు దానిని 20 మందికి కుదించింది.
ఇది కొంత ఉపశమనంలా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగిపోయే పరిస్థితికి దారితీస్తుంది. అయితే ఎల్ఎ్ఫఎల్ హెచ్ఎం పోస్టును ఇవ్వాలంటే గతంలో 121 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ఉండగా, ఇప్పుడు దానిని 150కి పెంచారు. అంటే ఉపాధ్యాయ సంఘాలు కోరిన మేరకు ఇవ్వకపోగా ఇంకొంత ఇబ్బంది పెట్టేలా విద్యార్థుల సంఖ్యను ఇంకా పెంచేసింది. దీంతో ఈ ఉత్తర్వులపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు పది అంశాలపై మంత్రి హామీలు ఇచ్చినా, కేవలం రెండు అంశాల్లో అందులోనూ ఒకటి ప్రతికూలంగా సవరణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
సర్దుబాటు సాధ్యం కాదు
తాజా ఉత్తర్వులతో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇంకా పెరిగిపోతాయి. ఫౌండేషన్ పాఠశాలల్లో కేవలం 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే చాలా చోట్ల 5, 10 మంది విద్యార్థులతో పాఠశాలలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు 20 మంది వరకు ఒకరే టీచరు అనే నిబంధన పెట్టడంతో వేల సంఖ్యలో పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోనున్నాయి. ఇప్పటికే ఉన్నవాటితో కలిపితే దాదాపు 10 వేల పాఠశాలలు ఈ జాబితాలో ఉంటాయి. ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు ఏవైనా కారణాలతో సెలవు పెడితే ఆ రోజుకు పాఠశాలను దాదాపుగా మూసేయడం తప్ప వేరే దారి ఉండదు. ఇప్పటికే ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలల్లోనూ ఇదే ఇబ్బంది ఉంది. ఇప్పుడు సింగిల్ టీచర్ స్కూళ్లు పెరిగిపోతున్నందున పక్క గ్రామాల టీచర్లను సర్దుబాటు చేయడం కూడా సాధ్యం కాదు.
మిగిలిన హామీలేవీ?
ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పలు హామీలు ఇచ్చారు. వారానికి 42 పీరియడ్లు ఉండాలన్న నిబంధనను 36కు తగ్గిస్తామన్నారు. కానీ తాజా జీవోలో ఆ ప్రస్తావనే లేదు. ప్రీహైస్కూల్కు పీఈటీని, ఆర్ట్ టీచర్ను ఇస్తామని ఇచ్చిన హామీ గురించీ వివరించలేదు. ఉర్దూ స్కూళ్లలో పోస్టుల అంశం, ఉన్నత పాఠశాలల్లో అదనపు సెక్షన్లు లాంటి అంశాలను విస్మరించారు. టీచర్లు అడుగుతున్నారు కాబట్టి ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా సవరణ జీవో జారీ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు వస్తున్నాయి.
0 Response to "School only when the teacher comes!"
Post a Comment