Some schools are exempted from merger
కొన్ని పాఠశాలలకు విలీనం నుంచి మినహాయింపు
- నేటి నుంచి కమిటీల పరిశీలన
- బాలికల జూనియర్ కళాశాలల్లో పీజీటీల నియామకాలపై వేచి చూసేధోరణి
ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులు, విద్యార్థులను సమీప హైస్కూళ్ళకు తరలించే విషయమై జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తల్లితండ్రుల నుంచి వస్తోన్న వ్యతిరేకత, నిరసనల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు సమగ్రశిక్ష ఏపీసీ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో స్కూలు హెచ్ఎం, పేరెంట్స్ కమిటీ (పీసీ) చైర్మన్, ఎంఈవో సభ్యులుగా ఉంటారు. స్కూల్ మ్యాపింగ్లో ఏవైనా లోపాలు జరిగాయా, హైస్కూలుకు వెళ్ళేందుకు విద్యార్థులకు ఏవైనా అడ్డంకులు అంటే చేపల చెర్వులు, జాతీయ రహ దారులు, భారీవాహనాలు నడిచే రోడ్లను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందా తదితర అంశాలను ఈ కమిటీ సోమ, మంగళవారాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రత్యక్షంగా తనిఖీచేసి నివేదికను కలెక్టర్కు అందజేస్తుంది. ఈ నివేదిక ఆదారంగా ఎక్కడైనా విద్యార్థులకు నిజంగా ఇబ్బందులు ఉన్నట్టు కమిటీ నిర్ధారిస్తే సంబంధిత పాఠశాలలను మ్యాపింగ్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తారు. ఆ ప్రకారం ఏలూరు జిల్లాలో మొత్తం 173 పాఠశాలల్లోకి సమీప ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఆయా తరగతుల విద్యార్థులను మ్యాపింగ్ చేయగా, ఇంతవరకు 23 పాఠశాలల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో మ్యాపింగ్ నుంచి ఎన్ని పాఠశాల లకు మినహాయింపు ఇవ్వవచ్చో కమిటీ నివేదికపై ఆధారపడిఉంటుంది.
టీచర్లకు లెక్చరర్లుగా పదోన్నతిపై వేచిచూసే ధోరణి
మండలానికో జూనియర్ కళాశాలను బాలికల కోసం ప్రారంభించిన ప్రభుత్వం ఆ మేరకు ఇంటర్మీడియట్ విద్యను బోధించేందుకు అవసరమైన అధ్యాపకుల నియామకాలపై మాత్రం ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. హైస్కూల్ ప్లస్ పేరిట ప్రారంభిస్తోన్న బాలికల జూనియర్ కళాశాలల్లో అధ్యాపక విధులను నిర్వర్తించేందుకు హైస్కూళ్లలో పనిచేస్తోన్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులకే పీజీటీలుగా పదోన్నతులు ఇచ్చి నియమిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. అయితే ఇంటర్మీడియట్ విద్యామండలి ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు తరగతులు ఈనెల ఒకటో తేదీ నుంచే జరు గుతున్నాయి. ఇక చాలా ఆలస్యంగా తెరుచుకునే బాలికల జూనియర్ కళా శాలల్లో తరగతులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయో, పీజీటీల నియమకాలు (పదోన్నతులపై) ఎప్పటికి పూర్తవుతాయో, అసలు కొత్త కళాశాలల్లో అడ్మిషన్లు ఎన్ని జరుగుతాయోనన్న సందేహాలు ఇపుడు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కళాశాలలకు పూర్తిస్థాయిలో పీజీటీలను నియమించినా సంబంధిత ఉపాధ్యాయులకు బోధన పూర్తిగా ఉంటుందా, ఒకవేళ ఇంటర్ విద్యకు విద్యార్థులు చేరకుంటే పీజీటీలు హైస్కూల్ తరగతులు బోధించేందుకు అంగీకరిస్తారా లేక తాము జూనియర్ కళాశాల విదులకే పరిమిత మంటారా అనే సందిగ్ధత ప్రభుత్వస్థాయిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందేహాల నడుమ కొత్త కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తయ్యేవరకు పీజీటీల నియామకాలు, సంఖ్యపై వేచిచూసేధోరణిలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
0 Response to "Some schools are exempted from merger"
Post a Comment