When Rakhi Full Moon Occurs What is Rakhi What is said about Rakhi Festival According to Puranas
రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది.రాఖీ అంటే ఏమిటి.పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి ఏమి చెప్పారు.రక్షా బంధన్ ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలి
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఒకప్పుడు ఉత్తర భారతానికే ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రక్షా బంధన్ వేడుకలను ఎందుకని జరుపుకుంటారు.. ఈరోజున తమ అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు కచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు, రాఖీ పండుగ ఉన్న రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షా బంధన్ లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం(రక్షా బంధన్) కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ.. వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి, వారి నుదుట వీర తిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు.
పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణు దేవుడు ఆ రాక్షసి నాశనం చేస్తాడు. అప్పటినుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది.
చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచం మొత్తాన్ని జయించాడని చెప్పుకునే ది గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో పోరస్ అనే రాజు తనను అడ్డుకుంటాడు. అయితే ఆ సమయంలో ఆ రాజు భార్య రొక్షన తన భర్తను చంపొద్దని కోరుతూ ఓ లేఖతో పాటు ఒక పవిత్ర దారాన్ని అలెగ్జాండర్ కు పంపుతుంది. అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకుని ఆ రాజును చంపకుండా వదిలేస్తాడు
మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో రక్షా బంధన్ గా పిలిచే ఈ పండుగను సావనీ, సలోనా అని కూడా అంటారు. గుజరాత్ లో పవిత్రోపనా, మహారాష్ట్రలో నరాళి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారీకేళ పౌర్ణమి అని పిలుస్తారు. మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుడిని ఆరాధిస్తారు. రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఘూలాన్ పూర్ణిమ పేరిట రాధాక్రిష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు. మన దేశంతో పాటు నేపాల్, ఇతర దేశాల్లోని హిందువులు, జైనులు, సిక్కులందరూ ఈ పండుగను జరుపుకుంటారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి కేవలం మనుషుల ఆసక్తిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రచురించబడింది.
రక్షా బంధన్ ఎప్పుడు జరుపుకోవాలి
2022 ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఎప్పుడొచ్చిందనే విషయంలో చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఈసారి రక్షాబంధన్ రోజునే, భద్ర అనే తిథి వచ్చింది. దీంతో ఏరోజు రాఖీ పండుగను జరుపుకోవాలనే గందరగోళంలో పడిపోయారు చాలా మంది. కొందరేమో ఆగస్టు 11వ తేదీన రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. మరి కొందరు రాఖీ కట్టే సమయం చాలా తక్కువగా ఉంటుందని, అందుకే 12వ తేదీ రాఖీ కట్టాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రాఖీ పండుగ 11వ తేదీ వచ్చిందా లేదా 12వ తేదీనా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
రాఖీ ఎప్పుడు కట్టాలంటే.
ఈసారి భద్ర కాలం కారణంగా, రక్షా బంధన్ తేదీల గురించి గందరగోళం ఏర్పడింది. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ అంటే పూర్ణిమ తిథి అంటే ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 7:06 గంటలకు ముగియనుంది. ఇదే సమయంలో పూర్ణిమతో పాటు భద్ర తిథి కూడా ఉంటుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రాఖీ పండుగను భద్ర కాలంలో జరుపుకోవచ్చు. అంటే ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల మధ్యలో మీ సోదరులకు రాఖీ కట్టొచ్చు
పౌర్ణమి తిథి ఆగస్టు 12వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈరోజంతా సోదర సోదరీమణులు రక్షాబంధన్ పండుగను జరుపుకోవచ్చు.
భద్ర కథేంటంటే.
పురాణాలలో భద్ర గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం సూర్య దేవుని కుమార్తెను భద్రగా పరిగణిస్తారు. అంటే శని దేవునికి సోదరి. శని స్వరూపం కఠినంగా ఉంటుందని, అలాగే భద్ర కూడా స్వభావరీత్యా కూడా కాస్త కఠినంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మా తన పంచాంగంలో విష్టి కరణం స్థానం కల్పించాడు. వాస్తవానికి భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులను అడ్డుకోవడం ప్రారంభించింది.
శుభకార్యాలు వాయిదా.
ఈ నేపథ్యంలో బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి, ఏడో కరణ విష్టిగా కరణాలలో చోటు కల్పించాడు. భద్ర మూడు లోకాలలో ఉంటారని చెబుతారు. తను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూనే ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అస్సలు జరగవు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏమి చేసిన ఫలితం నిరాశజనకంగానే వస్తుందని చాలా మంది నమ్ముతారు.
ప్రత్యేక పరిస్థితుల్లో.
ఈ సందర్భంగా రక్షా బంధన్ పండుగ రోజున భద్ర కాలం వచ్చింది. అందుకే భద్ర భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల వరకు సోదర సోదరీమణులు రాఖీ పండుగను జరుపుకోవచ్చు
0 Response to "When Rakhi Full Moon Occurs What is Rakhi What is said about Rakhi Festival According to Puranas"
Post a Comment