DSC after counting the posts
పోస్టులు లెక్కకట్టాక డీఎస్సీ
మండలిలో విద్యా మంత్రి బొత్స ప్రకటన
కొత్తగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే నూతన విద్యా విధానం అమల్లో భాగంగా స్కూళ్ల మ్యాపింగ్, జాబ్ ఛార్జ్ రూపకల్పన తర్వాత ఎన్ని పోస్టులు అసరమౌతాయో లెక్కించి అప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో విద్యారంగంలో సంస్కరణలు అనే అంశంపై జరిగిన లఘు చర్చకు మంత్రి బొత్స సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేబాలల దినోత్సవమైన నవంబర్ 14వ తేదీన ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులందరికీ ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచితంగా టాబ్ ఇవ్వాలని సీఎం జగన్ తనతో చెప్పారని వెల్లడించారు. గత మూడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం విద్యపై 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని, ఈ ఖర్చును తాము సంక్షేమంగా కాక రాష్ట్ర భవిష్యత్కు ఉపయోగపడే పెట్టుబడిగా చూస్తున్నట్లు మంత్రి బొత్స అన్నారు.
ఎన్ ఈపి మంచిదని నమ్మాం
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి తాము అమలు చేయడం లేదని, ఈ విధానంతో విద్యార్థుల భవిష్యత్ మారుతుందని తాము నమ్మాం కాబట్టి ఎన్ఎపిని అమలు చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఈ విధానంలో భాగంగా 4800 పాఠశాలలు మ్యాపింగ్ చేశామని, 600 స్కూళ్లపై అభ్యంతరాలు వచ్చాయని, 300 స్కూళ్ల సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఏ స్కూల్ను మూసివేయడం లేదని, వాటిని విలీనం మాత్రమే చేస్తున్నామని, అంగన్ వాడీ స్కూళ్లతో సహా అన్ని పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లను మాత్రమే పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులంటే తమ ప్రభుత్వానికి ఎంతో గౌరవమన్నారు.. నాడు నేడు పథకం ద్వారా గత మూడేళ్లలో 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మన పాఠశాలలను ఆదర్శంగా తీసుకునే ప్రధాని మోడీ పిఎంశ్రీ స్కూళ్ల పథకాన్ని ప్రకటించారనిచెప్పారు.
ఇంగ్లీష్ మీడియంపై వెనక్కి తగ్గేది లేదు.
ఒకటో తరగతి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దీనిపై రాజకీయంగా చాలా విమర్శలు వస్తున్నాయని, అయినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరి వారి సంఖ్య పెరుగుతుందంటే ఇంగ్లీష్ మీడియంనే కారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో భాగంగా రాష్ట్రం లో ఉన్న దాదాపు లక్షా 90 వేల క్లాస్ట్రూమ్స్ డిజిటల్ పాఠాలు చెప్పించబోతున్నామని చెప్పారు. విశ్వవిద్యాల యాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టులో కేసులు తేలడం లేదని బొత్సఅన్నారు.
0 Response to "DSC after counting the posts"
Post a Comment