Study with phones?
ఫోన్లతో చదువులా?
- త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధన
- 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు
- ఇప్పటికే స్మార్ట్ఫోన్ల వివరాల సేకరణ
- ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు
విద్యా విధానంలో మార్పులతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు జాతీయ విద్యావిధానం పేరిట ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు సన్నద్ధమవుతోంది. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు స్మార్ట్ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా బోధించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు విద్యార్థులు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్లు తెచ్చుకోవాలని విద్యాశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల కొనుగోలు కారణంగా తమపై ఆర్థిక భారం తప్పదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల చేతికి ఫోన్ ఇస్తే.. వారు చదువుతారా? లేదోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా వినియోగిస్తే పర్వాలేదు కానీ గాడి తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,16,047 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు వీరందరికీ త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధనకు ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. నవంబరు ఒకటో తేదీ నుంచి కొన్ని పరిమితులతో బోధన, స్టడీ అవర్స్ ఉంటాయని భావిస్తున్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్ను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యార్థి తల్లిదండ్రుల వద్ద ఉన్న స్మార్ట్ఫోన్ను పాఠశాలకు తీసుకెళ్లాలి. తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థుల నుంచి స్మార్ట్ ఫోన్ ఉన్నదీ, లేనిదీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ వివరాలను యూ-డైస్ లాగిన్లో స్మార్ట్ ఫోన్ నంబర్తో సహా డేటాను క్యాప్చరింగ్ చేసి ఎంటర్ చేస్తారు. ఈ నెల 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. 20వ తేదీ నాటికి ముగిస్తారు. తర్వాత విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో యాప్ను ఇన్స్టలేషన్ చేయడానికి ఈ నెల 21 నుంచి రోజుకి ఒక తరగతి చొప్పున 28 వరకు షెడ్యూల్ను నిర్దేశించారు. ఈ మేరకు విద్యార్థుల స్మార్ట్ఫోన్లో బైజూస్ యాప్ డౌన్లోడ్తో పాటు పాఠ్యాంశాల కంటెంట్ను అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సంబంధిత మండలాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) ప్రధానోపాధ్యాయులకు సహకరించనున్నారు. కాగా 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నవంబరులో ట్యాబ్లను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 30,272 మంది 8వ తరగతి విద్యార్థులకు విడతలవారీగా ట్యాబ్లు పంపిణీ చేస్తారని సమాచారం. ఇదే మాదిరి మిగతా తరగతుల విద్యార్థులకు కూడా ట్యాబ్లు పంపిణీ చేస్తే.. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సర్వత్రా ఆందోళన
పుస్తకాలు పట్టుకునే చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్లు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నా వాటిని పిల్లలకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడక పొవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే బోధనకు సంబంధించిన బైజూస్ కంటెంట్తో పాటే ఇతర సైట్ల వైపు కూడా విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తరగతి గది బోధన వల్ల సత్ఫలితాలు ఉంటాయి తప్ప.. ఇటువంటి ధోరణులు విద్యార్థులను పెడదోవ పట్టించే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వమే ఇవ్వాలి
టీచర్ల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లతో ఆన్లైన్ పాఠ్యాంశాల బోధనను తెరపైకి తెచ్చింది. తరగతి గదిలో టీచర్లు ప్రత్యక్షంగా బోధిస్తేనే ఫలితాలు అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఇక విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే మరీ ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్లకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులందరికీ ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో అందింస్తే పాఠ్యాంశాల వరకే అవి పరిమితమవుతాయి. కనుక ఇబ్బంది ఉండదు. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ల వల్ల పాఠాలు చదవడం లేదని, పాడవుతున్నారని పలు సందర్భాల్లో రుజువైంది.
కిషోర్కుమార్,యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
0 Response to "Study with phones?"
Post a Comment