Bonds in transfers
బదిలీల్లో బంధనాలు
సంఘ నాయకులకు పాయింట్లు కట్
పదోన్నతులు పొందిన టీచర్లు కూడా బదిలీ
విలీన ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సర్వీసుపై గందరగోళం
నిబంధనలు సడలించాలంటూ డిమాండ్
ఉపాధ్యాయుల బదిలీపై ప్రభుత్వం 187వ నెంబరు జీవో జారీ చేసింది. బదిలీల నిబంధనల ప్రకారం 2021-22 నాటికి ఐదేళ్లు ఒకేచోట సర్వీసు చేసిన ఉపాధ్యాయులు విధిగా బదిలీ అవుతారు. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు సర్వీసు చేసిన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను తప్పనిసరిగా బదిలీ చేస్తూ జీవో జారీ చేశారు. ఇందులో 2024, ఆగస్టు 31కి ముందు పదవీ విరమణ చేసే టీచర్లను మినహాయించారు. జీరో సర్వీసు ఉన్నవారికి రిక్వెస్టు బదిలీలకు అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. జీవో ప్రకారం ఆగస్టు 31 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని బదిలీలు చేస్తున్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు బదిలీల కోసం టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. కేటగిరీ 4లో ఉన్న టీచర్లకు ఏడాదికి ఐదు పాయింట్లు, కేటగిరీ 3లో ఉంటే 3 పాయింట్లు, కేటగిరీ 2లో ఉంటే రెండు పాయింట్లు, కేటగిరీ 1లో ఉంటే ఒక పాయింటు ఇస్తున్నారు. రేషనలైజేషన్ వద్ద ఇతర పాఠశాలలకు వెళ్లే టీచర్లకు ఐదు పాయింట్లు ఇస్తున్నారు. దివ్యాంగులకు 70 శాతం వైకల్యం ఉంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్లో బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇందులోనూ 2022, నవంబరు 31 నాటికి ఉన్న ఖాళీలను ప్రాతిపదికగా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఖాళీల వివరాలను నేడు వెబ్సైట్లో విద్యాశాఖ ప్రకటించనుంది. మరోపక్క ఉపాధ్యాయులు తమకు దగ్గర్లోని పాఠశాలల్లో ఉండే ఖాళీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ
జిల్లాలోని 348 ఉన్నత పాఠశాలల్లోని 6 వేల మంది, 317 యూపీ పాఠశాలలు, 1,872 ప్రాథమిక పాఠశాలల్లో 5 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ మొత్తంలో దాదాపు ఆరు వేల మందికిపైగా టీచర్లు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. వీరిలో 8 ఏళ్లు సర్వీసు నిండిన టీచర్లు దాదాపు మూడు వేల మంది ఉన్నారు. వీరు విధిగా బదిలీ కానున్నారు. కేటగిరీ 1, 2, 3ల్లోని ఖాళీ పోస్టులు వెబ్ ఆప్షన్లలో కనిపించే పరిస్థితి లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మెరుగైన స్థానాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
పదోన్నతులకు బదిలీ లింకు అన్యాయం
2020 అక్టోబరులో పదోన్నతులు పొందిన టీచర్లు బదిలీ చేస్తామనడం దారుణం. 117, 128 జీవోలు చట్టరీత్యా చెల్లుబాటు కాదు. కొన్ని నిబంధనలు గందరగోళంగా ఉన్నాయి. కేటగిరీ 1, 2, 3 స్థానాలను బ్లాక్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. - జె.లెనిన్ బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పాయింట్లు తీసేయడం దారుణం
టీచర్ల సంఘాల నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు 5 పాయింట్లు అదనంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పాయింట్లను తొలగించడం ఎంతవరకు సబబు? బధిరులకు ప్రాధాన్యత కల్పించాలి. రేషనలైజేషన్ ద్వారా బదిలీ అయిన వారిని మళ్లీ బదిలీ చేయిస్తామనడం విడ్డూరం.
- వి.సాంబశివరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఎయిడెడ్ టీచర్లకు అన్యాయం చేయకండి
ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన ఎయిడెడ్ టీచర్లకు వారు చేరినప్పటి నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికీ ఎయిడెడ్ పాఠళాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు రెండు, మూడు పాఠశాలలకు మారారు. ఇప్పుడు వారు మరో పాఠశాలకు వెళ్లే దుస్థితి ఏర్పడుతోంది. వారిని గతంలో పనిచేసిన స్కూల్ పాయింట్ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలి. పాఠశాలను ఒక యూనిట్గా కాకుండా పంచాయతీని ఒక యూనిట్గా తీసుకోవాలి
0 Response to "Bonds in transfers"
Post a Comment