Adjustment of Education Department
విద్యా శాఖ సర్దుబాటు
- ఉన్నత పాఠశాలల్లో పాఠం చెబితే రూ.2,500 అలవెన్స్
- ఎస్జీటీలకు ఆఫర్
- పదోన్నతులు లేకుండా కొత్త సంప్రదాయం
- ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
- ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానిస్తోందని ధ్వజం
- న్యాయబద్ధంగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్.
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా పాఠశాల విద్యాశాఖ కొత్త ఎత్తుగడ వేసింది. అర్హత కలిగిన ఎస్జీటీలు స్కూలు అసిస్టెంట్లుగా ఉన్నత పాఠశాలల్లో పాఠాలు చెబితే అదనంగా నెలకు రూ.2,500 అలవెన్స్ ఇస్తామంటూ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. అయితే విద్యా శాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కోర్టు కేసు సాకుగా చూపి పదోన్నతుల ప్రక్రియ నుంచి తప్పించుకుంటుందని ఆరోపిస్తున్నాయి.
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకంటూ విద్యా శాఖ సర్దుబాటు ప్రతిపాదనను తీసుకువచ్చింది. అందుకు అంగీకరించిన వారికి రూ.2,500 అలవెన్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 159 స్కూలు అసిస్టెంట్ (ఆంగ్లం) పోస్టుల కోసం నగరంలోని డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా వున్న స్కూలు అసిస్టెంట్ పోస్టుల (ఆంగ్లం) భర్తీకి గత ఏడాది పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. అప్పుడు 103 మంది ఎస్జీటీల నుంచి సమ్మతి తీసుకున్నారు. నిబంధనల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పుడే పదోన్నతుల ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఎస్జీటీలుగానే ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నారు. గత నెలలో బదిలీలకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ టీచర్ల కొరత వున్నందున సర్దుబాటుకు నిర్ణయించి గతంలో పదోన్నతులు ఇచ్చిన ఎస్జీటీలకు అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. సమ్మతి వుంటే మాత్రమే తాజాగా చేపట్టనున్న కౌన్సెలింగ్కు రావాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 159 ఆంగ్లం స్కూలు అసిస్టెంట్ ఖాళీల్లో సర్దుబాటుకు డీఈవో ఎల్.చంద్రకళ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. ఇలా సర్దుబాటుకు సమ్మతి తెలిపే టీచర్లకు నెలకు రూ.2,500 అలవెన్స్ ఇస్తామని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తే ప్రతి టీచర్కు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని తప్పించుకునేందుకే పాఠశాల విద్యా శాఖ ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ చట్టబద్ధమైన పదోన్నతులు ఇచ్చుకోవచ్చునని వారు గుర్తుచేస్తున్నారు. కోర్టు తీర్పునకు లోబడి మాత్రమే అన్న నిబంధన ప్రస్తావిస్తూ పదోన్నతులు ఇచ్చే అవకాశం వుందని యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చిన్నబ్బాయ్ పేర్కొన్నారు. అందువల్ల టీచర్లకు న్యాయబద్ధంగా పదోన్నతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ప్రతి టీచర్ తన సర్వీస్లో పదోన్నతి తీసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపుతారని ఎస్టీయూ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.దేముడు బాబు అన్నారు. నిబంధనలు పాటించకుండా చేస్తున్న సర్దుబాటు ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొరత వుంటే ఇప్పటి వరకు అమలుచేసిన విధానాలు పాటించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. నెలకు రూ.2500 అలవెన్స్ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం టీచర్లను దారుణంగా అవమానిస్తోందన్నారు.
0 Response to "Adjustment of Education Department"
Post a Comment