Employees are suffocating
ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి!
- ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగానే జీతాలు?!
- సాంకేతిక సమస్యలే ప్రధాన సమస్య
- డివైజ్లు, సాంకేతిక లోపాలు శాపాలౌతాయన్న భావన
- ఫీల్డ్ డ్యూటీలున్న వారి పరిస్థితిపైనా ఆందోళన
ప్రభుత్వం ఉద్యోగులకు ఫేషియల్ రిక గ్నిషన్ విధానంలో అటెండెన్స్ నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. వాటి ఆధారంగానే వేతనాల చెల్లింపులు ఉంటాయని ఆవేదన చెందుతున్నారు. ఈ విధానానికి వ్యతిరేకం కాకపోయినా ఇందులో సాంకేతిక లోపాలుంటే నష్టపోతామని భయపడుతున్నారు. దీనివల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 159 అన్ని శాఖల ఉద్యోగుల్లోనూ గుబులు రేపుతోంది. ఫేషియల్ రికగ్నిషన్కు సంబంధించి ఏర్పాటు చేసే డివైజ్లు సరిగాలేకపోతే సాంకేతిక ఇబ్బందులు ఏర్పడతాయన్నది ఉద్యోగుల భావనగా ఉంది. డివైజ్ సిగ్నల్స్ సరిగా రాకపోతే విధులకు హాజరైనా నిర్ణీత సమయంలో వచ్చినట్టు నిరూపించుకోవటం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ కార్యాలయాల్లోనే ఉండరని, కొంతమంది ఫీల్డ్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధానాన్ని ప్రవేశపెట్టేముందు ఉద్యోగసంఘాలతో చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఉద్యోగుల నుంచి బలంగా ఆందోళన వస్తుండటంతో ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించాయి. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగులు పది నిమషాలు ఆలస్యంగా వచ్చినా గైర్హాజరుగా భావించటం జరుగుతుందన్న ఆదేశాల నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ను ప్రవేశపెట్టే విషయంలో కూడా లింకు ఉందని భావిస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ హాజరును పరిగణనలోకి తీసుకుని జీతభత్యాలు ఇస్తున్నట్టు ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో, డివైజ్లు పనిచేయకపోయినా.. సిగ్నల్స్, నెట్వర్క్ సమస్యల వల్ల రికగ్నిషన్ కాకపోతే.. ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానం ప్రవేశపెట్టేముందు ఉద్యోగ సంఘాలతో చర్చించటం సముచితమంటున్నారు. ఉద్యోగుల అనుమానాలు, ఫీల్డ్ డ్యూటీలు తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని తీసుకురావాలే తప్ప ఏకపక్షంగా తీసుకువస్తే తాము నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విధి నిర్వహణ ఎక్కువగా ఉండే రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్టీసీ, రవాణా తదితర శాఖలకు సంబంధించిన ఉద్యోగుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, ఏపీజీఈఏ జేఏసీ, ఏపీజీఈఎఫ్ జేఏసీల దృష్టికి పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగసంఘాలు తీసుకువెళ్లాయి. నూతన సంవత్సరం రోజున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఏపీ జేఏసీ అమరావతి తరపున బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి నేతృత్వంలో బయోమెట్రిక్ అంశంపై చర్చించారు. ఈ విధానాన్ని అమలు చేసే ముందు ఉద్యోగసంఘాలతో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
0 Response to "Employees are suffocating"
Post a Comment