Mukkoti yekadasi
ముక్కోటి ఏకాదశి నాడు భోజనం చేయకూడదని ఎందుకు అంటారు ?
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి హిందువులకు ఎంతో విశిష్టమైన రోజు. మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటారు.
ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలు కాదని గమనించాలి. కోటి అంటే సమూహం అని అర్థం. మూడు సమూహాలకు చెందిన దేవతలతో కలిసి విష్ణువు భూలోకానికి విచ్చేస్తారని అర్థం. ఇంతటి మహత్తరమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని, ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని అంటారు. ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదో వివరించే కథ మన పురాణాల్లో ప్రచారంలో ఉంది. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది కొన్ని శక్తులను పొందుతాడు. ఆ శక్తులను ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడానికి వాడుతూ దుర్వినియోగం చేస్తాడు.
ఆ సమయంలో దేవతలు, ఋషులు.. ఈ రాక్షసుడి నుంచి లోకాన్ని రక్షించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అయితే మురతో వెయ్యేళ్ళ పాటు యుద్ధం చేయగా.. ఆ యుద్ధంలో అలసిన విష్ణువు.. ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో ముర రాక్షసుడు అక్కడకు వచ్చిన విష్ణువుని అంతం చేయాలనుకుంటాడు. అయితే విష్ణువు యొక్క తేజస్సు నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి రాక్షసుడిని సంహరించింది. శుక్ల పక్షంలో పదకొండవ రోజున ఆ కన్య ఉద్భవించడంతో ఏకాదశి (1+10) అని పేరు పెట్టారు. ముర వంటి రాక్షసుడ్ని అంతం చేసిన రోజు కనుక.. ఈరోజున ఉపవాసం ఉండి విష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. మనిషిలో ఉన్న రాక్షస గుణాలు, చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
అంతేకాకుండా వైకుంఠం చేరే భాగ్యం లభిస్తుందని.. జన్మ బంధనం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తిన్నవారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని.. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నంఎం పప్పు ధాన్యాలు తినకుండా.. పాలు, పండ్లు తింటే మంచిదని చెప్పడం జరిగింది. చంద్రోదయానికి ముందుగానే పాలు, పండ్లు తీసుకుని విష్ణు నామం జపిస్తూ ఆ రోజంతా గడిపిన వారికి విష్ణు అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 2023లో వైకుంఠ ఏకాదశి జనవరి 2 సోమవారం నాడు వచ్చింది. ఈరోజున శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు.. ఉపవాసం ఉండి.. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి జరుగుతుందని అంటారు.
0 Response to "Mukkoti yekadasi"
Post a Comment