Coromandel Express Tragedy: Diversion into Loop Line Caused Fatal Accident?
కోరమాండల్ ఎక్స్ప్రెస్ విషాదం: లూప్లైన్లోకి మళ్లించినందుకే ఘోర ప్రమాదం జరిగిందా?
- 20 సెకెన్లలో 128 నుంచి 0 స్పీడ్కు
- ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగ పతనమిదీ.
- లూప్లైన్లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణమా?
- గూడ్స్ రైలు లేదని చెబుతున్న అధికారులు
- కానీ.. ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్న గూడ్స్ బోగీ
ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తోంది.
అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
0 Response to "Coromandel Express Tragedy: Diversion into Loop Line Caused Fatal Accident?"
Post a Comment