Schools will resume from today
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.
- ఈనెల 17వతేదీ వరకు ఒంటిపూట బడులు
- అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
- మధ్యాహ్న భోజనం యథాతథం
- దూరప్రాంతాలకు బదిలీ అయినటీచర్ల గగ్గోలు
వేసవి సెలవులు ముగిశాయి. బడిగంటలకు వేళయింది. సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంకానున్నాయి. ఒకపక్క జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నా పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేష్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఐదు రోజులపాటు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. తరగతులకు హాజరైన విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ ఇవ్వాలని, మఽధ్యాహ్న భోజనం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించి 12 గంటలకు ముగించి అనంతరం విద్యార్థులను గృహాలకు పంపాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతమేర పాఠశాలలకు పంపుతారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
నేడు జగనన్న విద్యాకానుక అందజేత
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నా పాఠశాలలను వేసవి సెలవులు ఇచ్చే ముందు మాదిరిగా ఒంటిపూట బడులను సోమవారం నుంచి పున ఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభం నాడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా పాఠ్యపుస్తకాలు, బ్యాగు, బె ల్టు, సాక్సులు, బూట్లు, యూనిఫాం, డిక్షనరీ ఇవ్వాల్సి ఉంది. గతేడాది మాదిరిగా కాకుండా ఈసారి పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే పాఠశాలలకు చేర్చారు. ఉర్దూ సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యపుస్తకాలు ఇంకా జిల్లాకు చేరలేదు. 95 శాతం మేర పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను టీచర్లు అందించాల్సి ఉంది.
బదిలీ అయిన టీచర్ల గగ్గోలు
వేసవి సెలవులకు ముందే టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో ప్రభుత్వం నిర్వహించింది. గతనెల 24వ తేదీన ప్రారంభమైన టీచర్ల బదిలీ ప్రక్రియ ఆదివారం నాటితో ముగిసింది. టీచర్ల పోస్టులను బ్లాక్ చేయడంతో టీచర్లు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు బదిలీ అయ్యారు. దీంతో టీచర్లు గగ్గోలుపెడుతున్నారు. బదిలీ అయిన టీచర్లు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. బదిలీ అయిన ఎస్జీటీలకు ఎంఈవోలు, స్కూల్ అసిస్టెంట్లకు డీవైఈవోలు బదిలీల ఉత్తర్వులతోపాటు రిలీవ్ అయినట్లుగా ఉత్తర్వులు ఆదివారం ఇచ్చారు. సుదూర ప్రాంతాలకు బదిలీ అయిన టీచర్లు అక్కడ రిపోర్టు చేయడంతోపాటు కుటుంబాలను అక్కడకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లోని అధికశాతం టీచరు పోస్టులను బ్లాక్ చేయడంతో దగ్గరలోని తాము కోరుకున్న ప్రాంతాలకు కాకుండా, సుదూర ప్రాంతాల్లోని బదిలీ అయ్యామని టీచర్లు వాపోతున్నారు. కృష్ణా జిల్లా విడిపోయినా బదిలీల ప్రక్రియ ఉమ్మడి జిల్లాస్థాయిలోనే జరగడంతో సీనియర్ టీచర్లు 70 నుంచి 80 కిలోమీటర్లు అంతకుమించి దూరంలోని పాఠశాలలకు బదిలీ కావాల్సి వచ్చిందని టీచర్లు చెబుతున్నారు.
నాడు-నేడు పనులు పూర్తికాని వైనం
కృష్ణా జిల్లాలో 488 పాఠశాలల్లో రెండో విడత నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పాఠశాలల విద్యాకమిటీలు, ప్రధానోపాద్యాయులు అంతగా పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడం లేదా నత్తనడకన సాగుతున్నాయి. గూడూరు మండలంలో 14, మచిలీపట్నంలో 48, అవనిగడ్డ 10, మొవ్వ 20, బాపులపాడు 21, పమిడిముక్కల 22, చల్లపల్లి 21, పెనుమలూరు 27, బంటుమిల్లి 20, కృత్తివెన్ను 18, గన్నవరం 22, గుడివాడలో 26 పాఠశాలలకు అదనపు తరగతిగదుల నిర్మాణం, ఇతరత్రా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. బందరు మండలం తుమ్మలపాలెంలో రూ.70 లక్షల వ్యయం అంచనాలతో నిర్మాణం చేయాల్సిన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం పనులు జరగడంలేదు. అయినా విద్యాశాఖ అధికారులు ఆవైపునకు కన్నెత్తి చూడటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
0 Response to "Schools will resume from today"
Post a Comment