Sainik schools have released a notification for admission in classes six and nine in the year 2025-26
సైనిక్ పాఠశాలలు పిలుస్తున్నాయ్.
ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశం
దేశభక్తిని చాటుకోవాలనే విద్యార్థులకు సైనిక్ పాఠశాలలు చక్కని అవకాశం కల్పిస్తున్నాయి.
ఇటువంటి ఆలోచనలు ఉన్నవారికి ఇదే సువర్ణావకాశం. సైనిక్ పాఠశాలల్లో 2025-26 ఏడాదిలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశం పొందడానికి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలకు అవసరమైన సైనిక అధికారులను తయారు చేయాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా సైనిక్ పాఠశాలలను ప్రారంభించారు. సైనిక్ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి బాలబాలికలు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశం పొందడానికి బాలురు మాత్రమే అర్హులు. ఇందులో సీటు పొందడానికి సైనిక పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షల్లో నెగ్గాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యను కొనసాగించొచ్చు.
రిజర్వేషన్లు ఇలా
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆరో తరగతిలో 80 సీట్లు, తొమ్మిదో తరగతిలో 20 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేస్తారు.
సౌకర్యాలు
ఆరు నుంచి ఇంటర్ వరకు విద్య, వసతితో పాటు, ఎన్సీసీ, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, ఈత, గుర్రపు స్వామీ తదితర సహ పాఠ్య కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి ఏడాది రూ.1.10 లక్షల ఫీజుగా చెల్లించాలి. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 శాతం విద్యార్థులకు రక్షణ శాఖ నుంచి రూ. 53 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందొచ్చు. సైనిక్ పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తయిన తరవాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష (ఎన్డీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పుణేలో రెండేళ్లు శిక్షణ ఇస్తారు. ప్రతిభ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో అధికారులుగా నియమిస్తారు.
విద్యార్థుల కవాతు
పరీక్షా విధానం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష పూర్తిగా రాత విధానంలో ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు రెండున్నర గంటలు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు 3 గంటల పరీక్ష సమయం. ఆరో తరగతి పరీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో, తొమ్మిదో తరగతికి ఆంగ్లంలో ఉంటుంది.
సిలబస్
ఆరో తరగతి: 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. గణితం 150 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకు, భాషా సామర్థ్యం 50 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు (2.30 గంటలు) అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40 శాతం మార్కులు రావాలి.
తొమ్మిదో తరగతి: 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో గణితం 200 మార్కులకు, సామాన్యశాస్త్రం 50 మార్కులు, ఆంగ్లంలో 50 మార్కులకు, సాంఘికశాస్త్రం 50, ఇంటెలిజెన్స్ 50 మార్కులకు సంబంధించి ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (3గంటలు). అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40 శాతం మార్కులు రావాలి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
అర్హులు
ఆరో తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు (01 ఏప్రిల్ 2013 నుంచి 31 మార్చి 2015) మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతుండాలి. తొమ్మిదో తరగతిలో 13 నుంచి 15 ఏళ్ల వయస్సు కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ (01 ఏప్రిల్ 2010 నుంచి 31 మార్చి 2012) లోపు జన్మించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం
ప్రవేశ పరీక్ష 2025 జనవరి 28న నిర్వహిస్తారు. www.aissee.nta.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువపత్రాలను, విద్యార్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలి. జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ. 650, ఎస్సీ, ఎస్టీలు రూ.500 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. తుది గడువు డిసెంబర్ 20. రిజిస్టర్ చేసుకున్న చరవాణి నంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తారు. ఆన్లైన్లో పంపిన విద్యార్థుల దరఖాస్తును ఫ్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.
ధ్రువపత్రాలు..: - జనన, కుల, నివాస, ధ్రువపత్రాలతో పాటు సైనిక ఉద్యోగుల పిల్లలకు సర్వీసు ధ్రువపత్రం, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు పీపీఓను అప్లోడ్ చేయాలి.
పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్
0 Response to "Sainik schools have released a notification for admission in classes six and nine in the year 2025-26"
Post a Comment