*♻️డీఎస్సీ పరీక్ష కేంద్రాల*
*ఏర్పాటుపై కసరత్తు*
*గడువుకంటే ముందే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు*
*రోజుకి 40 నుంచి 50 వేలమందికి రెండు విడతల్లో పరీక్షలు*
*ఇప్పటికే ఐయాన్ కేంద్రాలు ఎంపిక..*
*ఇంజినీరింగ్ కళాశాలలూ పరిశీలన..*
*అమరావతి, ఆంధ్రప్రభ:* మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకుఅధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండటంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా.. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6 తేదీ నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతోపాటు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో కూడా డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితోకూడా సంప్రదింపులు జరిపారని సమాచారం.
*♻️ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా?*
డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియే షన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తు న్నారు. వారి స్పీడ్ చూస్తుంటే.. పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసేలా ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్అయాన్ కేంద్రాలు ఎంపికచేయగా.. వాటి సామర్థం రోజుకి సరాసరి 20 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితోపాటు ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుంచి 30 వేల మందికి ఒకేరోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్నా.. గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే.
*♻️తొలిసారి ఎస్సీ వర్గీకరణతో పోస్టులు..*
కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈ డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే అమలు చేశారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా.. ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్నది కూడా అధికారులు తెలియజేశారు. ఎస్సీజీఆర్ 1, జీఆర్ 2, జీఆర్ 3 కింద మూడు కేటగిరీల్లో వరుసగా.. 1848, 45419, 61905 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. ఇక మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్ధులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులను నమోదు చేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
0 Response to " "
Post a Comment