Cyber crimes emerging
ఓఎల్ఎక్స్లో ప్రకటనలు ఇచ్చే వాళ్లే లక్ష్యంగూగుల్ పే’లో నగదు బదిలీ చేస్తామంటూ ఖాతా ఖాళీ
వారంరోజుల వ్యవధిలో 40 వరకు ఫిర్యాదులు రూ. 2 కోట్ల వరకు కొల్లగొట్టినట్టు అంచనా.చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
ఈనాడు, హైదరాబాద్: మీరు నగదు లావాదేవీలు గూగుల్ పే ద్వారా చేస్తున్నారా? జర జాగ్రత్త. సైబర్ నేరస్థులు గూగుల్ పే మొబైల్ యాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరతీశారు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో పాత వస్తువులు విక్రయిస్తామంటూ ప్రకటనలు ఇచ్చిన వారి వివరాలు సేకరించి, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లిస్తామంటూ నమ్మించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం మొదలైన ఈ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
యాప్లతో అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
‘‘వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే వారికి గూగుల్ పే వివరాలు చెబుతున్నామని, నిమిషాల వ్యవధిలో ఖాతాల్లోంచి రూ.లక్షల్లో నగదు కొల్లగొడుతున్నారంటూ’ బాధితులు పోలీస్ స్టేషన్లకు పరుగుపెడుతున్నారు.
‘‘వారం రోజుల వ్యవధిలో ఈ తరహా ఫిర్యాదులు 40 వచ్చాయి.
బాధితుల తెలిపిన వివరాల ఆధారంగా నేరస్థుల తాలూకూ ప్రాథమిక ఆధారాలు సేకరించాం’’ అని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. ‘‘సైబర్ నేరగాళ్లు ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల వరకు కొల్లగొట్టారని అంచనాకు వచ్చాం. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా అల్వార్, కామా, నగర్ తహసీల్ గ్రామాల్లో నేరస్థులున్నట్టు గుర్తించాం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపే వారు అప్రమత్తంగా ఉండాలి’’ అని అదనపు డీసీపీ కె.సి.ఎస్.రఘువీర్ వెల్లడించారు. ఈ తరహా మోసాలకుపాల్పడుతున్న నిందితులు ఒక్కొక్కరూ రోజుకు 30 మంది నుంచి 50 మందికి ఫోన్ చేస్తున్నారని హెచ్చరించారు.
సగం చెల్లిస్తామంటారు..సాంతం కాజేస్తారు
ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో వస్తువులను అమ్మకానికి పెట్టిన వారిని సైబర్ నేరస్థులు ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. అనుమానం రాకుండా ప్రకటనల్లో పేర్కొన్న ధర కంటే తక్కువగా ఇవ్వాలంటూ రెండుమూడు దఫాలుగా బేరమాడుతున్నారు. బేరం కుదిరిన తర్వాత తాము కొనుగోలు చేసే వస్తువు ధరలో సగం ముందు చెల్లిస్తామని, వస్తువు తీసుకెళ్లే సమయంలో మిగిలినది ఇస్తామని చెబుతున్నారు. గూగుల్ పే ద్వారా బదిలీ చేస్తే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుందని నమ్మిస్తూ ఆ వివరాలు సేకరిస్తున్నారు. వాళ్లు నమ్మారని భావించిన పిమ్మట మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
గూగుల్ పే యాప్లో పే, రిక్వెస్ట్, చాట్ అన్న మూడు ఐచ్ఛికాలుంటాయి.
ఒక వ్యక్తి ఇతరుల నుంచి వస్తువు కొనుగోలు చేసే పక్షంలో వారికి ‘పే’ అన్న ఐచ్ఛికాన్ని పంపాలి. వారు వివరాలు పంపితే తన ఖాతా ద్వారా వారికి నగదు బదిలీ చేయొచ్చు.
ఎవరైనా ఇతరులకు వస్తువులు విక్రయించే పక్షంలో వారికి రిక్వెస్ట్(అభ్యర్థన) ఐచ్ఛికాన్ని పంపాలి. కొనుగోలుదారు సదరు వ్యక్తి గూగుల్ యాప్ వివరాలనుచూసి నగదు బదిలీ చేస్తాడు.
ఆదమరిస్తే అంతే సంగతి
సరిగ్గా ఇక్కడే సైబర్ నేరస్థులు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రకటనకర్తల యూపీఐ వివరాలను తీసుకుంటున్నారు. క్యూఆర్కోడ్ పంపించండంటూ అభ్యర్థిస్తున్నారు. అనంతరం ‘పే’ ఐచ్ఛికానికి బదులుగా రిక్వెస్ట్ ఐచ్ఛికాన్ని పంపుతున్నారు. విషయ పరిజ్ఞానం లేని వాళ్లు దాన్ని తెరిచి, నేరగాళ్ల సూచనల మేరకు ‘పే’ అన్న లింకుపై క్లిక్ చేస్తున్నారు. అప్పటికే యూపీఐ నంబరు నేరస్థుల వద్ద ఉండడంతో నగదును వారి ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు.
0 Response to "Cyber crimes emerging"
Post a Comment