- ఆడుతూ.. పాడుతూ చదువు
- ఎస్సీ గురుకులాల్లో సరికొత్త విద్యావిధానం
- ఏడాదికి రెండుసార్లు ఆటలు, డ్యాన్స్
- ప్రతి శనివారం ‘డ్రాప్ ఎవ్రీతింగ్ అండ్ రీడింగ్’
- శ్రీకారం చుట్టిన ఎస్సీ గురుకుల సొసైటీ
ఆటలు.. పాఠాలను అర్థం చేసుకునే బలాన్నిచ్చి మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తాయి. ఆటపాటలు వేరు, చదువు వేరు అనుకోకుండా.. పిల్లలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఇప్పుడు.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య, వికాసం మధ్య సమన్వయం సాధించి శాస్త్రీయ ఆలోచనల సాకారం దిశగా ఎస్సీ గురుకులాలు ప్రణాళికలు అమలు చేయాలని సంకల్పించాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి రాములు గురుకులాల్లో పిల్లలకు విన్నూత్న విద్యా విధానాన్ని పరిచయం చేశారు. పాఠశాలల సిబ్బంది, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల పాత్ర వహించేలా కార్యాచరణ ప్రారంభించారు. ఈ సంవత్సరం గురుకుల పాఠశాలల్లో డీప్(డ్రాప్ ఎవ్రీతింగ్ ఎంజాయ్ ప్లేయింగ్), డీడ్(డ్రాప్ ఎవ్రీతింగ్ అండ్ ఎంజాయ్ డ్యాన్స్), డీర్(డ్రాప్ ఎవ్రీతింగ్ అండ్ ఎంజాయ్ రీడింగ్) కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డీప్, డీడ్లు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. డీర్ను ప్రతి శనివారం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శనివారం 188 ఎస్సీ గురుకులాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయవంతం చేశారు.
ఒకే రోజు డీప్, డీడ్...:
రాష్ట్రంలో డీప్, డీడ్ అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే రోజు నిర్వహిస్తారు. సెప్టెంబరు 14న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డీప్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు డీడ్ నిర్వహించారు. మళ్లీ డిసెంబరు 14న ఇదే సమయాల్లో నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహించాలన్నది ఆయా ప్రిన్సిపాళ్లు నిర్ణయిస్తారు. డీప్ కార్యక్రమానికి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. డ్యాన్స్కు సంబంధించి డీడ్ కార్యక్రమానికి సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొనవచ్చన్నారు. ఫస్డ్ ఎయిడ్ కిట్తోపాటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలు, సిబ్బంది వారికి నచ్చిన ఇన్డోర్, అవుట్డోర్ గేమ్స్ ఆడుకునే అవకాశముంది. టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ వర్కర్లు, సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు, గురుకులాల్లో పనిచేసే ఇతర సిబ్బందితో ఆటల టీంలను ఏర్పాటు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.. డీప్, డీడ్ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాళ్లు/డీసీఓలు విద్యార్థులను, సిబ్బందిని చైతన్యవంతులుగా చేసి డైయింగ్ ఆర్ట్/మ్యూజిక్, స్పోర్ట్స్, గ్రేమ్స్లో పాల్గొనేలా చేయాలన్నారు.
ఇక ప్రతి శనివారం డీర్ కార్యక్రమం
రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలన్న ఆలోచనలకు గురుకులాలు అందిపుచ్చుకున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బందిలో కూడా చదివే అలవాటును పెంపొందించాలని డ్రాప్ ఎవ్రీతింగ్ అండ్ ఎంజాయ్ రీడింగ్(డీర్) కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ రోజు పాఠశాల పుస్తకాలు కాకుండా ఏదో ఒక పుస్తకం విధిగా చదవాలి. ప్రతి శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.00 గంట వరకు ప్రతి ఒక్కరూ లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి వారి సొంత వాక్యాల్లో సమీక్ష చేస్తారు. ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, అటెండర్లతో సహా అందరూ సిబ్బంది పాల్గొంటారు. పుస్తకాలను చదివి సమీక్ష చేసిన వాటిని టీచర్లు చదివి వారిని బెస్ట్ స్టూడెంట్/స్టాఫ్ డీర్గా... అంటే స్టార్ ఆఫ్ డీర్గా ప్రకటిస్తారు. వచ్చే వారం వరకు వారే స్టార్ ఆఫ్ డీఆర్గా ఆ విద్యార్థి/స్టాప్ బ్యాడ్జ్ ధరించవచ్చు. వారి పేర్లను సొసైటీ మేగజైన్లో ప్రకటిస్తారు. ఈ నిబంధనలన్నీ ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది అనుసరించాలని గురుకులాల కార్యదర్శి శ్రీరాములు సూచించారు.
0 Response to "The latest education in SC Gurukul"
Post a Comment