Amma vadi
అమ్మఒడి నమోదులో పాట్లు
సర్వర్ మొరాయింపుతో ఇక్కట్లు
పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న అమ్మఒడి పథకానికి సంబంధించిన వివరాల నమోదులో పాట్లు ఎదురవుతున్నాయి. సర్వర్ మొరాయించడంతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాలో సుమారు 5.41 లక్షల మంది వివరాలను నమోదు చేయాల్సి ఉండగా చైల్డ్ఇన్ఫో ప్రకారం సదరు విద్యార్థుల వివరాలను నమోదుచేసే ప్రక్రియ తొలిదశ పూర్తయింది. మలిదశలో ప్రతి విద్యార్థి తల్లికి సంబంధించిన ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు ఈ ప్రక్రియను సోమవారం చేపట్టారు. ఒక్కసారిగా అన్ని పాఠశాలల నుంచి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఉపాధ్యాయులు ఉపక్రమించడంతో సర్వర్ మొరాయించింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిగా పనిచేయలేదు. సాయంత్రానికి సర్వర్ అడపాదడపా పనిచేయడంతో కొద్దిమంది తల్లుల వివరాలను మాత్రమే పొందుపరచగలిగారు. తల్లుల వివరాలను నమోదు చేయడానికి ఈనెల 27 వరకు గడువు విధించారు. గడువు సమీపిస్తుండటంతో వివరాలను నమోదు చేసేందుకు కొంతమంది ఉపాధ్యాయులు సోమవారం రాత్రి కూడా శ్రమించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం నాటికి దాదాపు 45 వేల మంది విద్యార్థుల తల్లుల వివరాలను మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారని జిల్లా విద్యాశాఖ వర్గాలవారు తెలిపారు.
చిన్న తప్పిదం జరిగినా నష్టం..
అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు, వారి తల్లుల వివరాల నమోదులో చిన్న తప్పిదం జరిగినా విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను ఏవిధమైన తప్పిదం లేకుండా సమగ్రంగా ఆన్లైన్లో పొందుపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఆయా పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయుడి లాగిన్లో పొందుపరిచే డేటాను ఎంఈవోల లాగిన్లోకి పంపాల్సి ఉంటుంది. ఆ డేటాను ఎంఈవోలు ఆయా గ్రామాల కార్యదర్శులకు పంపిస్తారు. వాటిని క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు, గ్రామ పంచాయతీల సిబ్బంది పరిశీలించి తప్పొప్పులను సరిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత సక్రమమైన జాబితాను గ్రామ కార్యదర్శులు ఎంఈవోలకు పంపిస్తారు. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాత అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థుల జాబితాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అర్హులకు అన్యాయం జరిగితే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొనడం.. విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచడానికి గడువు పెంచాలంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలివీ..
అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పలు పాఠశాలల్లో కంప్యూటర్ల లేమి, ఉన్న చోట ఆపరేటర్ల కొరత, ఉపాధ్యాయులకు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో డేటా నమోదుకు విఘాతం కలుగుతోంది. వివరాల నమోదుకు సమయం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులందరూ ఒకేసారి నమోదు ప్రక్రియను ప్రారంభించడంతో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది.
0 Response to "Amma vadi"
Post a Comment