Ammavadi
- పథకం కింద లబ్ధి పొందనున్న విద్యార్థుల సంఖ్యపై స్పష్టత
- తెల్లరేషన్ కార్డు ఉండి 75 శాతం హాజరున్న వారంతా అర్హులే
- జిల్లాలోని విద్యా సంస్థల్లో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
- అమ్మఒడి @ 8.38 లక్షలు
జిల్లాలో అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందనున్న విద్యార్థుల సంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 8.38 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తొలుత ప్రకటించినట్లు జనవరి 26 నుంచే ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థికి ఏటా రూ.15,000 వంతున ప్రభుత్వం అందజేస్తుంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ పథకం అమలుకు జిల్లాకు సుమారు రూ.1,257.46 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి విద్యార్థి ఈ పథకం కింద అర్హులవుతారు. ఆ విద్యార్థికి 75 శాతం హాజరు ఉండటం తప్పనిసరి. మధ్యలో చదువు మానేస్తే ఈ పథకం కింద అనర్హులవుతారు. స్వచ్ఛంద సేవా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న అనాథ, వీధిబాలలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ప్రాధమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న చైల్డ్ఇన్ఫోలో తప్పకుండా నమోదవ్వాలి. ఆధార్లో తప్పిదాలు, ఇతర కారణాల వల్ల కొందరు విద్యార్థుల వివరాలు ఇందులో నమోదు కాలేదు. ఈ సమస్య పరిష్కారంపై యంత్రాంగం ప్రస్తుతం దృష్టి సారించింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసే సమయంలో రేషన్ కార్డు, తల్లి/సంరక్షకుల బ్యాంకు ఖాతా నకలు జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
0 Response to "Ammavadi"
Post a Comment