Home survey in AP .. YSSAR Navasakam from today
ఏపీలో ఇంటింటి సర్వే.. నేటి నుంచే వైఎస్సార్ నవశకం
ఏపీలో వైఎస్సార్ నవశకం ప్రారంభంకాబోతోంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 20 వరకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే జరగనుంది. 'వైఎస్సార్ నవశకం' పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. ఈ సర్వే ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. సర్వే నిర్వహణకు ఇప్పటికే గ్రామ, పట్టణ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వేపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఆయా అంశాలపై మార్గదర్శకాలను వివరించారు. ఇంటింటి సర్వేలో నూతనంగా రేషన్ బియ్యం అందించేందుకు ఒక కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరోకార్డు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు.
ప్రభుత్వ అధికారులు, ఇన్కం టాక్స్ పేయర్లు కాకుండా రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారంతా ఈ కార్డు పొందవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా కారు ఉన్నా ఆరోగ్య శ్రీకి అర్హులే. వీటితో పాటు జగనన్న విద్యా దీవెన ద్వారా అమ్మఒడి, ఇతర స్కాలర్షిప్లు, నైపుణ్య కార్పొరేషన్ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణకు హాజరయ్యేలా కార్డును అందిస్తారు. ప్రభుత్వ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు ఈ జగనన్న వసతి దీవెన కార్డు అందిస్తారు. వీటితోపాటు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమపథకాలకు అర్హులైన జాబితాలను కూడా ఈ సర్వేలో గుర్తిస్తారు.
ఏపీలో ప్రస్తుతం విద్యా, వైద్య, సంక్షేమ పథకాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. బియ్యం తీసుకోకపోయినా చాలా మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. బియ్యం కార్డులు విడిగా ఇవ్వడం వల్ల అవసరమైన వారే తీసుకుంటారని.. దీని వల్ల రేషన్ అక్రమ వ్యాపారానికి బ్రేక్ పడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక ప్రత్యేక సర్వే చేయడం వల్ల బోగస్ కార్డులు కూడా కొన్ని బయటపడతాయని భావిస్తున్నారు. ఐతే సర్వే పేరిట కొన్ని కార్డులు తొలగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
0 Response to "Home survey in AP .. YSSAR Navasakam from today"
Post a Comment