Are these decisions to be announced tomorrow by CM on Amravati?
అమరావతిపై రేపు సీఎం జగన్ ప్రకటించే నిర్ణయాలు ఇవేనా ?
ఏపీ రాజధానిపై వైసీపీ ప్రభుత్వ తుది నిర్ణయం ఏమిటి ?
రాజధాని రైతుల ఆందోళనకు స్పందనగా భారీ ప్యాకేజీ ప్రకటనతో పాటు భవిష్యత్తుపై భరోసా కల్పించేలా కేబినెట్ సబ్ కమిటీ ప్రకటన ఉంటుందా ? రాజధానిగా అమరావతి తప్ప తమకేమీ వద్దంటున్న రైతుల ఏకైక అజెండాను ప్రభుత్వం పట్టించుకుంటుందా ? నిధుల లేమిని కారణంగా చూపుతూ విశాఖ రాజధానికి జై కొడుతుందా ? అసలు కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలోనే జరుగుతుందా ? రాజధాని గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని అమరావతిలో మొదలైన ప్రకంపనలు జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత మరింత ముదిరాయి. దీంతో రాజధాని రైతులకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎటో వెళ్లిపోగా... రాజధానిగా అమరావతి తప్ప మాకేదీ వద్దనే వాదన తెరపైకి వచ్చేసింది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఇక్కడి గ్రామాల్లోని రైతులు రోజూ రోడ్డెక్కి విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనల పర్వం తారా స్ధాయికి చేరడంతో సీఎం జగన్ సహా మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. ఈ వ్యవహారం ఇంకా నాన్చడం అనవసరమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయానికి వచ్చే దారిలో ఉన్న మందడం గ్రామంలో నిరసనలను దృష్టిలో ఉంచుకుని స్ధానికులకు కేబినెట్ రోజు రాకపోకలకు ఆందోళనలు చేయొద్దంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. వారు ఆంక్షలతో మాట వినరనే నిర్ణయానికి వచ్చేశారు. దీంతో కేబినెట్ భేటీ వేదిక కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి మారబోతోంది.
ఇక కేబినెట్ అజెండా విషయానికొస్తే రాజధాని మార్పు అంశమే ఈసారి ప్రధాన చర్చనీయాంశం కానుంది. రాజధాని రైతులను శాంతింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రేపు కేబినెట్ లో చర్చ తర్వాత దీనికి ఆమోద ముద్ర వేయబోతోంది. ఇందులో రాజధాని రైతులకు గతంలో ఇచ్చిన ఐదేళ్ల కౌలు చెల్లింపు గడువు మరో పదేళ్ల పెంపుతో పాటు ప్యాకేజీలోనూ భారీ మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో రైతులకు మరింత ఊరటగా రాజధానిలో వారి భూములకు బదులుగా విశాఖలో అభివృద్ధి చెందిన భూములను ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. మరోవైపు గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధాని రైతుల కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలు నెరవేరలేదు. వాటిని తక్షణం అమలు చేసేలా వైసీపీ సర్కారు ఓ ప్రణాళిక ప్రకటించే అవకాశముంది. వీటితో పాటు అమరావతి రైతులకు ఇక్కడ చేయబోయే అభివృద్ధిలో భాగస్వాములను చేసేలా మాస్టర్ ప్లాన్ అమలు చేసే అవకాశముంది. దీన్ని రైతులతో చర్చించి ఖరారు చేసేందుకు వీలుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని సైతం ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు, నారాయణస్వామిలకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
ఇన్ని హామీలిచ్చినా రైతులు మాత్రం అమరావతి రాజధాని అంశంపైనే పట్టుబట్టే అవకాశముంది. అయితే ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళిక ప్రకటిస్తే రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుందని సర్కారు పెద్దలు అంచనా వేస్తున్నారు. దీంతో 28న విశాఖలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వీలుగా ప్రభుత్వం దూకుడుగా ముందుకెళుతోంది. సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.1290 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో దాదాపు రూ.300 కోట్ల మేర పనులకు నిధులను సైతం విడుదల చేస్తూ ఇవాళ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
మరోవైపు కేబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని భావిస్తున్న పోలీసులు విజయవాడతో పాటు గుంటూరు నుంచి సచివాలయానికి వెళ్లే అన్ని దారులను దిగ్బంధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతో పాటు సచివాలయానికి వెళ్లే అన్ని దారులనూ జల్లెడపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. అన్నింటికీ మించి కేబినెట్ వేదికను రహస్యంగా ఉంచుతున్నారు. రేపు ఉదయం పరిస్ధితులను బట్టి చివరి నిమిషంలో కేబినెట్ వేదిక విషయంలో మంత్రులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
0 Response to "Are these decisions to be announced tomorrow by CM on Amravati?"
Post a Comment